Crime: ఫోన్ లోనే బుకింగ్.. ఆన్లైన్లో చెల్లింపులు.. వ్యభిచార కేసులో విస్తుపోయే నిజాలు..
ఇద్దరు అనాథ ఆడ శిశువులను చేరదీసింది. వారిని పెంచింది. వారు యుక్త వయస్సులోకి రాగానే ఆమె అస్సలు స్వరూపం బయటపడింది. ఆమె ఆడ పిల్లల్ని పెంచింది మంచితనంతో కాదు దర్భుద్దితో.. ఆ ఇద్దరు బాలికలతో ఆమె వ్యభిచారం చేయిస్తోంది. చివరికి అందులో ఓ బాలిక ద్వారా విషయం బయటకొచ్చి ఆమె కటకటాల పాలయింది.

యాదగిరిపల్లి
యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని యాదగిరిపల్లికి చెందిన కంసాని అనసూయ 16 ఏళ్ల క్రితం ఇద్దరు ఆడ శిశువులను చేరదీసింది. వారిని యుక్త వయస్సు వచ్చే వరకు పోషించింది. ఆ తర్వాత ఇద్దరు బాలికలతో వ్యభిచారం చేయించి డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకుంది. తన బంధువైన సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లికి చెందిన కంసాని శ్రీనివాస్ వద్దకు బాలికలను
పంపించింది. అక్కడ అతను బాలికలతో వ్యభిచారం చేయించి అనసూయకు డబ్బు ఇచ్చేవాడు.

యాదగిరిపల్లి
ఆ తర్వాత బాలికలు యాదగిరిపల్లికి వచ్చారు. అక్కడ అనుసూయ బాలికలను కొడుతూ వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేసేది. అనసూయ వేధింపులు తట్టుకోలేక ఓ బాలిక పారిపోయింది. సిరిసిల్లలో ఉండే వ్యభిచార నిర్వాహకుడు కంసాని శ్రీనివాస్ వద్దకు వెళ్లాలని బాలిక నిర్ణయించుకుంది. యాదగిరిపల్లి పక్క గ్రామమైన వంగపల్లికి కాలినడక చేరుకున్న బాలిక అక్కడ రూ.20 అడుక్కుని జనగామ బస్టాండ్కు చేరుకుంది. అక్కడినుంచి సిరిసిల్ల వెళ్లేందుకు విద్యార్థులను డబ్బులు అడుగుతుండగా విద్యార్థులు 100 నంబర్కు ఫోన్ చేశారు. పోలీసులు బాలికను ప్రశ్నించగా.. కంసాని అనసూయ, శ్రీనివాస్ వ్యభిచారం చేయిస్తున్నారని చెప్పింది.

జనగామ
దీంతో బాలికను యాదాద్రి భువనగిరి జిల్లా బాలల సంరక్షణ సెంటర్ కు తరలించారు. జనగామ పోలీసులు యాదగిరిగుట్ట పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కంసాని అనసూయను అదుపులోకి తీసుకుని విచారించారు. ఆమె ఇచ్చిన సమాచారంతో కంసానీ శ్రీనివాస్ తో పాటు కరీంనగర్ జిల్లా రామడుగు చెందిన చంద భాస్కర్, చంద కార్తీక్, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కు చెందిన కంసాని లక్ష్మిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యాదగిరిపల్లికి చెందిన కంసాని ప్రవీణ్, హుస్నాబాద్ కు చెందిన కంసాని స్వప్న, కంసాని అశోక్, రామడుగుకు చెందిన సరోజ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

విటుల వద్దకే అమ్మాయిలు
దీనిపై లోతుగా దర్యాప్తు జరుపుతున్న పోలీసులు ఈ ముఠాకు చెందిన మరి కొంతమంది బాలికలు కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, యాదాద్రి, హైదరాబాద్ జిల్లాల్లో ఉన్నారని అనుమానిస్తున్నారు. వ్యభిచార నిర్వాహకులు సాంకేతికతను ఉపయోగించుకుంటూ గుట్టు చప్పుడు కాకుండా విటుల వద్దకే అమ్మాయిలను పంపిస్తున్నట్లు విచారణలో తేలింది. ఈ కారణంగానే అనుమానితుల ఇళ్లలో పోలీసులు దాడులు చేసినా ఎలాంటి ఆధారాలూ లభించడం లేదని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications