వింత చేష్టలు: మొన్న గులాబీతో.. నేడు పుస్తకం చూపిన భత్కల్
హైదరాబాద్: దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ళ సూత్రధారి, ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది యాసిన్ భత్కల్ తన వింత చేష్టలతో సంచలనం సృష్టిస్తున్నాడు. ఇటీవల కోర్టుకు హాజరవుతూ గులాబీతో కనిపించిన భత్కల్, మంగళవారం పుస్తకంతో మీడియాకు కనిపించాడు.
దిల్సుఖ్నగర్ పేలుళ్ల కేసులో భాగంగా మంగళవారం రంగారెడ్డి కోర్టులో భత్కల్ను హాజరు పర్చారు. అయితే కోర్టుకు హాజరయ్యే సమయంలో భత్కల్ ఓ పుస్తకాన్ని మీడియాకు చూపించాడు.
అప్రమత్తమైన పోలీసులు పుస్తకాన్ని వెంటనే స్వాధీనం చేసుకున్నారు. పుస్తకంలో ఏముందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా, భత్కల్ తోపాటు మరో నలుగురు నిందితులను కూడా పోలీసులు మంగళవారం కోర్టులో ప్రవేశపెట్టారు.
ఇది ఇలా ఉండగా, జైలు నుంచి పారిపోయేందుకు భత్కల్ కుట్ర చేస్తున్నాడని కొద్ది రోజుల క్రితం వార్తలు వినిపించిన విషయం విధితమే. ఇటీవల తన భార్యతో ఫోన్లో మాట్లాడుతూ.. జైలు గోడలు బద్దలు కొట్టుకుని బయటికి వస్తానని భత్కల్ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అయితే అదంతా ఉత్తదేనని జైలు అధికారులు చెప్పారు.
జైలు నుంచి భత్కల్ 27 సార్లు తన కుటుంబసభ్యులతో మాట్లాడాడని, అతడు మాట్లాడిన అన్ని కాల్స్ రికార్డు చేశామని చెప్పారు. నిఘా వర్గాల నుంచి కూడా ఎలాంటి సమాచారం, హెచ్చరికలు కూడా రాలేదని, ఎవరో కావాలని తప్పుడు సమాచారం సృష్టించారని ఆయన చెప్పారు.