వార్షిక జాబ్ క్యాలెండర్, జిల్లాలవారీగా ఉద్యోగాలు, గురుకులాల్లో 50శాతం సీట్లు స్థానికులకే: కేసీఆర్
హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల విషయంలో తెలంగాణ కేబినెట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఉద్యోగ నియామకాలకు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. మంగళవారం ప్రగతిభవన్లో సమావేశమైన తెలంగాణ మంత్రివర్గం రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలపై విస్తృతంగా చర్చించింది. ఇదే అంశంపై మరోసారి బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం కావాలని కేబినెట్ నిర్ణయించింది.

తెలంగాణలో ఇకపై వార్షింగ్ జాబ్ క్యాలెండర్
ఏటా ఉద్యోగ నియామకాల కోసం వార్షిక క్యాలెండర్ తయారీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు అన్ని రకాల పోస్టులలో ఖాళీలను గుర్తించిన తర్వాత ప్రతి సంవత్సరం రిక్రూట్మెంట్ కోసం 'వార్షిక క్యాలెండర్'ను తయారు చేయాలని అధికారులను ఆదేశించింది. కాగా, ఖాళీల గుర్తింపు, భర్తీ ప్రక్రియపై రేపు కూడా మంత్రివర్గం చర్చించనుంది.

కొత్త జోనల్ వ్యవస్థకు అనుగుణంగా ఉద్యోగాల కేటాయింపులు
కొత్త జోనల్ వ్యవస్థకు అనుగుణంగా ఉద్యోగుల జిల్లాల వారీ కేటాయింపులు చేపట్టనున్నారు. నూతన జిల్లాల వారీగా పోస్టులు కేటాయించాలని కేబినెట్ ఆదేశించింది. ఉద్యోగుల కేటాయింపులపై టీఎన్జీవో, టీజీవో విజ్ఞప్తిపై కేబినెట్లో చర్చ జరిగింది. ఉద్యోగ సంఘాల కోరిక మేరకు జిల్లాలవారీగా పోస్టుల కేటాయింపు, అధికారుల కేటాయింపును సత్వరమే చేట్టాలని, ఖాళీల గుర్తింపు, భర్తీ ప్రక్రియ త్వరితగతిన జరగాలని అధికారులను ఆదేశించింది.

గురుకులాల్లో స్థానికులకే 50 శాతం సీట్లు..
అంతేగాక, గురుకుల పాఠశాలల్లో స్థానిక రిజర్వేషన్లకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆయా నియోజకవర్గాల విద్యార్థులకు 50 శాతం సీట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పురోగతిపై పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలు కేబినెట్కు నివేదిక సమర్పించాయి. నెలలోపు వైకుంఠధామాలు పూర్తి చేయాలని మంత్రులను సీఎం ఆదేశించారు. అన్ని గ్రామాల్లో వీధి దీపాల కోసం ఏర్పాట్లు చేయాలని, ఇందుకు మూడోవైర్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
హైదరాబాద్ శివారు పురపాలికల్లో నీటి సమస్యపై ప్రధానంగా చర్చ జరిగింది. దీంతో తక్షణమే అదనంగా రూ. 1200 కోట్లను సీఎం కేసీఆర్ మంజూరు చేశారు. నీటి ఎద్దడి నివారణ చర్యలు, పురపాలికల అభివృద్ధికి ప్రత్యేక లే అవుట్లు అభివృద్ధి చేయాలని సీఎం ఆదేశించారు.












Click it and Unblock the Notifications