మీకు మంచి ఫాలోయింగ్ ఉంది.. ఇక్కడా పార్టీ పెట్టండి: సీఎం కేసీఆర్ కు వినతుల వెల్లువ
ఆంధ్రప్రదేశ్ లోనూ టీఆర్ఎస్ పార్టీని విస్తరించాలనే డిమాండ్ ఊపందుకుంటోంది.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లోనూ టీఆర్ఎస్ పార్టీని విస్తరించాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. ఈ మేరకు టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావుకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ-మెయిళ్లు, ఎస్సెమ్మెస్లు, లేఖలు వెల్లువెత్తుతున్నాయి.
మూడేళ్లుగా తెలంగాణలో పరిపాలన తీరు తెన్నులను, ఇక్కడ చేపట్టిన వివిధ పథకాలను అనేక రంగాలకు చెందిన ప్రముఖులు ప్రశంసించిన విషయం తెల్సిందే. ఇలా అభినందించిన వారిలో ఆంధ్రప్రదేశ్ నాయకులు, ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు.

ఆంధ్రాకూ మీ నాయకత్వం కావాలి...
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు న్యాయం చేయగలిగే ఏకైక నాయకుడు మీరే. సమస్యలను అర్థం చేసుకోవడంలో, వాటిని పరిష్కరించడంలో మీ పంథా అనుసరణీయం. సంక్షేమం, అభివృద్ధిని మేళవించి సమర్థంగా పాలన చేస్తున్నారు. తెలుగు ప్రజలందరూ మిమ్మల్ని కొనియాడుతున్నారు. మీలాంటి సమర్థ నాయకత్వం ఆంధ్రప్రదేశ్లోని తెలుగు వాళ్లకు కూడా కావాలి. మీ పార్టీ(టీఆర్ఎస్)ని ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించండి. లేదా ప్రారంభించుకోవడానికి ఆంధ్రాలో పార్టీ పెట్టడానికి మాకు అనుమతి ఇవ్వండి అంటూ ఆ లేఖల్లో వారు కోరుతున్నారు.

ఏపీలోనూ పెద్ద సంఖ్యలో అభిమానులు...
కేసీఆర్కు ఏపీలో పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లినపుడు అక్కడ జరిగిన సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగానికి ప్రజలు హర్షాతిరేకాలతో స్పందించిన తీరు అదే సభలో పాల్గొన్న ప్రధాని మోడీనే ఆశ్యర్యపరిచింది.
ఆనాటి కార్యక్రమానికి కేసీఆర్కు ఆహ్వానం పలుకుతూ స్థానిక రైతులు, ప్రజలు స్వాగత తోరణాలు కూడా కట్టారు. ఆ తర్వాత కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ఉభయగోదావరి జిల్లాలు, విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం తదితర జిల్లాల్లో కూడా ఆయన అభిమానులు వేడుకలు నిర్వహించారు.

టీఆర్ఎస్ విస్తరణ పట్ల ఆకాంక్ష...
ఇక తెలంగాణ ప్రభుత్వం రైతు రుణాలను పూర్తిస్థాయిలో మాఫీ చేసినపుడు, రైతులకు ఎరువులు, ఇతర పెట్టుబడుల కోసం ఎకరానికి రూ.4 వేల చొప్పున రెండు పంటలకు ఇస్తామని ప్రకటించినపుడు కూడా ఆంధ్రప్రదేశ్లోని రైతులు ముఖ్యమంత్రి కేసీఆర్ను కొనియాడుతూ ప్రకటనలు ఇచ్చారు. కొందరు రైతులు, రైతు సంఘాల నాయకులు స్వయంగా ముఖ్యమంత్రిని కలుసుకొని అభినందించారు. ఆ సందర్భంగా తమ ప్రాంతానికి కూడా టీఆర్ఎస్ పార్టీని విస్తరించాలని వారు కోరారు. ఇదే అంశం పై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ను గోదావరి జిల్లాలకు చెందిన యువత ట్విట్టర్ వేదికగా కూడా కోరిన విషయం తెల్సిందే.

నాయకుడంటే.. ఇలా ఉండాలి
తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేసిన నిరాధార ఆరోపణలపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించిన తీరుపై కూడా ఆంధ్రప్రదేశ్లో విస్తృత చర్చ జరిగింది. టీవీల్లో ఆ కార్యక్రమాన్ని ఆంధ్రా ప్రాంత ప్రజలు ఆసక్తిగా తిలకించారు. నాయకుడంటే ఇలా ఉండాలంటూ ఆంధ్రప్రదేశ్కు చెందిన పలువురు సోషల్ మీడియా వేదికగా తమ స్పందనలు పెట్టారు. ఇదే అంశంపై ముఖ్యమంత్రి కార్యాలయానికి ఈ-మెయిళ్లు, లేఖల రూపంలో స్పందన పంపారు.

మలిదశ ఉద్యమం తరువాత నుంచి...
మలిదశ ఉద్యమ ప్రారంభం నుంచి ఆంధ్రలో కొన్ని వర్గాలు, కొన్ని ప్రాంతాల్లో కేసీఆర్కు మంచి మద్దతు వచ్చింది. 1971 ప్రాంతంలో జై ఆంధ్ర ఉద్యమంలో పాల్గొన్న వారు టీఆర్ఎస్ ఉద్యమానికి మద్దతునిచ్చారు. 2004 సాధారణ ఎన్నికల్లో ఈసీ నిబంధనల మేరకు పార్టీ చిహ్నం కోసం ఆంధ్ర ప్రాంతంలో టీఆర్ఎస్ నామమాత్రపు అభ్యర్థులను నిలిపింది. ఆయా నియోజకవర్గాల్లో వారికి గణనీయంగా ఓట్లు పడడాన్ని బట్టి ఆంధ్రలో కేసీఆర్ కు ఏ స్థాయిలో ఫాలోయింగ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.












Click it and Unblock the Notifications