జీపుకు అడ్డుగా వచ్చాడని చితకబాదిన ఎస్ఐ: అవమానంతో యువకుడు ఆత్మహత్య
హైదరాబాద్: వరంగల్ జిల్లాలోని మరిపెడలో విషాదం చోటు చేసుకుంది. వాహనానికి అడ్డుగా వచ్చాడన్న చిన్న కారణంలో ఓ యువకుడిని స్టేషన్కు తీసుకెళ్లి చితకబాదారు. దీంతో అవమానం భరించలేక ఆ యువకుడు సెల్ టవర్పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
శుక్రవారం ఉదయం వెలుగు చూసిన ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే... అర్ధరాత్రి పెట్రోలింగ్ చేస్తున్న మరిపెడ ఎస్సై కృష్ణకుమార్ పోలీసు జీపుకు కృష్ణ అనే యువకుడు అడ్డుగా వచ్చాడనే కారణంతో పోలీసులు అతడిని స్టేషన్కు తీసుకెళ్లి చితకబాది అనంతరం వదిలేశారు.
అనంతరం స్టేషన్ నుంచి బయటకు వచ్చిన బాధితుడు అవమానంతో మనస్థాపం చెంది సమీపంలోని సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో యువకుడు అక్కడికక్కడే చనిపోయాడు. పండగ రోజున పోలీసులు తీసుకెళ్లి అవమానించడంతో మనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడని యువకుడి బంధువులు ఆరోపిస్తున్నారు.
విషయం తెలుసుకున్న యవకుడి కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని బాధితుడి మృతదేహాంతో పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. దీంతో మరిపెడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనపై ఎస్సై కృష్ణకుమార్ మాట్లాడుతూ పోలీసు జీపుకు అడ్డు రావడంతో అదుపులోకి తీసుకొని అనంతరం వదిలేశామన్నారు. మృతికి గల కారణాలను విచారిస్తున్నట్లు తెలిపారు.