సైంటిస్ట్ కావాల్సిన అమ్మాయి.. ఆథ్యాత్మిక వంచకుల చేతిలో బందీగా మారింది..
అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన ఆ అమ్మాయి.. సైంటిస్టు కావాల్సింది. కానీ ఆత్మశాంతిని వెతుక్కుంటూ ఆథ్యాత్మిక వంచకుల చేతుల్లో చిక్కుకుంది. ఆ రొంపిలో నుంచి బయటికి రాలేక బందీ అయింది. ఎలాగైనాసరే ఆమెను విడిపించుకోవాలన్న ప్రేమతో తల్లిదండ్రులు ఆశ్రమం చుట్టూ తిరుగుతున్నా ఫలితంలేకపోయింది. ఇదీ.. నిజామాబాద్ కు చెందిన రూప అనే యువతి గాథ.
అక్కడంతా అరాచకమే..
ఆధ్యాత్మికత పేరుతో అమ్మాయిలు, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అరాచకాలకు అంతులేకుండా పోయింది. రాజధాని ఢిల్లీలోని రోహిణీ ప్రాంతంలో ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయ పేరుతో ఓ ఆశ్రమం ఉంది. దీని స్థాపకుడు వీరేంద్రదేవ్ దీక్షిత్. పైకి చూసే వాళ్లకి అక్కడ ఆధ్మాత్మిక కార్యక్రమాలు, సేవలు జరుగుతాయన్న భ్రాంతి కలుగుతుంది. కానీ లోపల జరిగే వ్యవహారం వేరు. బాలికలు, అమ్మాయిలకు డ్రగ్స్ ఇచ్చి, వ్యభిచారం చేయిస్తున్నారనే ఆరోపణలు రావడంతో 2017లో ఈ ఆశ్రమంపై పోలీసులు దాడి చేశారు. ఆ తర్వాత సీబీఐ కేసు కూడా నమోదు చేసింది.
తల్లిదండ్రుల అరిగోస..
పోలీసుల దాడి తర్వాత ఆశ్రమంలోని మైనర్లను రెస్క్యూ హోంలకు తరలించారు. మేజర్లు మాత్రం.. తాము ఆశ్రమంలోనే ఉంటామని కోర్టుకు చెప్పి తిరిగివెళ్లిపోయారు. అంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో తమ పిల్లల్ని ఊహించుకోలేని తల్లిదండ్రులు.. బిడ్డల్ని ఇంటికి తీసుకెళ్లేందుకు చాలా కష్టాలు పడుతున్నారు.
నేను రాను.. మీరొస్తే ఎవర్నీ తీసుకురావొద్దు..
నిజామాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లిన రూప తల్లిదండ్రులు.. మీడియా సహాయంతో ఆశ్రమంలోకి వెళ్లాలని ప్రయత్నించారు. దీంతో రూప.. పేరెంట్స్ కు ఫోన్ చేసి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది. ‘‘నా మీద మీకు నమ్మకం లేనప్పుడు నేనెందుకు మీతో ఉండాలి? మీరిద్దరు వస్తేనే కలుస్తాను. వేరేవాళ్లను తీసుకొస్తే కలవను. మీ కళ్లను కమ్మిన పొర తొలిగిపోయినప్పుడే నిజాలు కనబడతాయి. అప్పటిదాకా నన్ను అర్థంచేసుకోలేరు''అంటూ రూప ఫోన్ లో మాట్లాడింది.
అమెరికాలో ఉన్నప్పుడు ఇలా లేదు..
సైంటిస్టు కోర్సు చదవడానికి రూప అమెరికా వెళ్లినప్పుడు ఇలా ఉండేదికాదని, ఎప్పుడు వెళ్లినా హ్యాపీగా రిసీవ్ చేసుకునేదని, ఢిల్లీకి వచ్చి ఈ ఆశ్రమంలో చేరిన తర్వాతే విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టిందని, కలవడం పూర్తిగా మానేసిందని తల్లిదండ్రులు మీడియాకు చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు స్పందించాల్సిఉంది.