జిఎస్టీ: మొబైల్ బిల్లులు ఎంత పెరుగుతాయంటే.., సెల్ ఫోన్ రేట్లపై డైలమా?
జిఎస్టీ (వస్తు, సేవల పన్ను) వల్ల జూలై 1 నుంచి మీ బ్రాడ్బాండ్, మొబైల్ బిల్లులు పెరగనున్నాయి. జిఎస్టీ వల్ల 3 శాతం అదనంగా మొబైల్ బిల్లులు పెరగనున్నాయి.
హైదరాబాద్/అమరావతి/న్యూఢిల్లీ: జిఎస్టీ (వస్తు, సేవల పన్ను) వల్ల జూలై 1 నుంచి మీ బ్రాడ్బాండ్, మొబైల్ బిల్లులు పెరగనున్నాయి. జిఎస్టీ వల్ల 3 శాతం అదనంగా మొబైల్ బిల్లులు పెరగనున్నాయి. కేంద్రం శుక్రవారం రాత్రి జిఎస్డీని ప్రారంభించనుంది.
జిఎస్టీ, ఆధార్-పాన్ లింకే కాదు ఇంకెన్నో: జూలై 1 నుంచి షాకింగ్ మార్పులు
జిఎస్టీ వల్ల వల్ల మొబైల్ కంపెనీలు వారు అందించే సేవలపై పన్ను రేటు పెరగనుంది. దీంతో మొబైల్ బిల్లులు పెరగనున్నాయి. జిఎస్టీ కౌన్సిల్ వివిధ ఉత్పత్తులపై 5, 12, 18, 28 శాతం చొప్పున 4రకాల పన్నులను వసూలు చేయాలని నిర్ణయించింది.
12 శాతంలోకి కాకుండా.. 18 శాతం పన్నులోకి
కాగా టెలికం రంగం ప్రస్తుతం 15 శాతం పన్ను పరిధిలో ఉంది. ఈ రంగాన్ని 12 శాతం పన్ను పరిధిలోకి తీసుకొస్తే ప్రభుత్వ ఖజానాకు గండి పడుతుంది. ఈ రాబడి వదులుకునేందుకు సిద్ధంగా లేదు. దీంతో ఈ పరిశ్రమను 18 శాతం పన్ను పరిధిలోకి తీసుకు వస్తున్నారు. యాక్ట్ 1968 ప్రకారం టెలికం సేవలు తప్పనిసరి సేవల నిర్వణలోకి వస్తాయి. ఈ చట్టంలో టెలికాంలు ముఖ్యమైన సర్వీసులుగా పరిగణించబడుతున్నాయని అంటున్నారు.
రూ.1000 బిల్లుపై రూ.30 అదనం
ఈ నేపథ్యంలో సేవల పన్ను రేట్లను 12 శాతానికి తక్కువ పరిధిలోకి తీసుకురావాలని కోరుతున్నవారు ఉన్నారు. టెలికాం పరిశ్రమపై విధించే పన్ను రేట్లతో వినియోగదారుల నెలవారీ సెల్ఫోన్ బిల్స్ కూడా 3 శాతం మేర పెరగనున్నాయి. దీంతో రూ.1000 బిల్లుపై మరో రూ.30 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
మొబైల్ ఫోన్ పెరుగుతుందా, తగ్గుతుందా?
మరోవైపు, జిఎస్టీ విధానంలో సెల్ఫోన్ల ధర పెరుగుతుందా.. అంటే కచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. సెల్ఫోన్లపై జిఎస్టీ రేటు 12 శాతంగా నిర్ణయించారు. ప్రస్తుతం దేశీయంగా తయారు చేస్తున్న సెల్ఫోన్లపై, దక్షిణాది రాష్ట్రాల్లో 7 శాతం పన్ను విధిస్తుండగా, రేపటి నుంచి ఇది ఐదు శాతం అధికం కానుంది. ఈ భారాన్ని వినియోగదారులకు బదిలీ చేస్తారా, తమ మార్జిన్లలో కంపెనీలు మినహాయించుకుంటాయా అనే సందిగ్ధత నెలకొంది. దిగుమతి చేసుకుంటున్న మొబైల్స్పై బేసిక్ కస్టమ్స్ ఇప్పుడు 12 శాతం ఉండగా, జిఎస్టీలో ఇది కొనసాగుతుందా, ఇంకా పెరుగుతుందా అనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు.
ప్రస్తుతం దేశీయంగా అయితే..
బేసిక్ కస్టమ్స్ విధించకపోతే, స్థానిక తయారీకి పన్ను ప్రోత్సాహకాలు ఎలా ఉండనున్నాయో ఇంకా తేలలేదు. ఇది వెల్లడైతే కానీ స్పష్టత రాదంటున్నారు. దేశంలోని అధిక రాష్ట్రాల్లోనూ సెల్ఫోన్లపై 5 శాతం విలువ జతచేరిన పన్ను (వ్యాట్), మరో 2 శాతం ఎక్సైజ్, ఇతర సుంకాలు కలిపి 7 శాతమే పన్ను పడుతోంది. దేశీయంగా తయారు/అసెంబ్లింగ్ అవుతున్న మొబైల్స్కు మాత్రమే.
విదేశాల నుంచి దిగుమతి అయితే..
విదేశాల్లో పూర్తిగా తయారై, దిగుమతి అవుతున్న సెల్ఫోన్లపై 12.5 శాతం బేసిక్ కస్టమ్స్తో పాటు ఇతర సుంకాలు వసూలు చేస్తున్నారు. ఇది కాక ఆయా రాష్ట్రాలు విధించే వ్యాట్ ఉంటుంది. అయితే విదేశాల నుంచి విడిభాగాలు తెచ్చుకుని అసెంబ్లింగ్ చేసినా, ఇక్కడే విడిభాగాలు సమకూర్చుకుని, తయారు చేస్తున్న సెల్ఫోన్లపై మాత్రం మొత్తంగా 7 శాతం పన్ను పడుతుంది. దిగుమతి చేసుకుంటే మొత్తంగా 18 శాతానికి పైగా పన్ను పడుతోంది.
పెరిగే అవకాశముందా?
జులై 1 నుంచి సెల్ఫోన్లపై జిఎస్టీ రేటును 12 శాతంగా చేశారు. అంటే దిగుమతులు అయినా, దేశీయ తయారీ అయినా ఒకేరకంగా 12 శాతం పన్నురేటు అమలవుతుంది.దిగుమతులపై బేసిక్ కస్టమ్స్ విధిస్తారో స్పష్టత రాలేదన్నారు. అది లేకపోతే, విదేశాల నుంచి దిగుమతి చేసుకుని, ఇక్కడ విక్రయిస్తున్న సంస్థలకు పన్ను భారం తగ్గుతుందని, అయితే దేశీయంగా యూనిట్లు స్థాపించి, సెల్ఫోన్లు తయారీ, అసెంబ్లింగ్ చేయిస్తున్న వారికి మాత్రం అదనపు భారం 5 శాతం వరకు పడుతుందని అంటున్నారు. ఇందువల్ల జులై 1 నుంచి సెల్ఫోన్ ధరలు అధిక రాష్ట్రాల్లో పెరిగే అవకాశముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, మేకిన్ ఇండియా లక్ష్యంతో పని చేస్తున్న ప్రధాని మోడీ దేశీయ తయారీదారులకు ప్రోత్సాహకాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.