దేశానికే మీ నాయకత్వం కావాలి : కేటీఆర్ కు రామోజీరావు లేఖ..!!
సీఎం కేసీఆర్..మంత్రి కేటీఆర్ పైన ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ఆయన కేటీఆర్ కు లేఖ రాసారు. శనివారం కేటీఆర్ జన్మదినం కావటంతో ఆయనకు శుభాకాంక్షలు చెబుతూనే...ఆయన పని తీరును అభినందనలతో ముంచెత్తారు. సాధారణంగా రాజకీయ నేతలు... అధికారులు ఒక మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పటం సాధారణంగా జరిగేదే. అయితే, ఇప్పుడు రామోజీ నేరుగా కేటీఆర్ కు అభినందనలతో లేఖ రాయటం చర్చనీయాంశంగా మారింది.
పరిణితి కలిగిన నాయకుడంటూ..
అరుదైన నాయకత్వ లక్షణాలు..అసాధారణ సంభాషణ నైపుణ్యం..అన్నింటినీ మించిన రాజకీయ చతురుత తో అనతి కాలంలోనే పరిణితి కలిగిన నాయకుడిగా ఎదిగి తెలంగాణ రాజకీయ యవనికపై వెలుగునీలుతున్నారంటూ కేటీఆర్ ను ప్రశంసిస్తూ..పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. ఒక ఉన్నత శ్రేణి నాయకునికి కావాల్సిన లక్షణాలన్నీ మూర్తీభవించిన మీ పని తీరును తాను తొలి నుండి గమనిస్తూనే ఉన్నానని.. మీరు సాధించిన పురోగతి చూసి గర్విస్తున్నానని లేఖలో పేర్కొన్నారు.

కేసీఆర్ ధన్యశీలి..
తన బిడ్డ తండ్రిని మించిన తనయుడు కావాలని ప్రతీ తండ్రి కోరుకుంటాడని..తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చి దిద్దటానికి మీరు చేస్తున్న నిరంతర శ్రమ..నాన్న గారి ఆకాంక్షలకు అనుగుణంగా సాగుతూ ఆయనకు అమితానందన్నిస్తోందని భావిస్తున్నట్లు వివరించారు. మీ వంటి చైతన్య శీలిని పుత్రునిగా పొందిన ఆయన ధన్య శీలి అంటూ అభినందించారు. ఆపదలో ఉన్న వారికి ఆదుకోవటం కోసం ..సమాచారం అందిన వెంటనే చర్యలు తీసుకుంటూ..చొరవ చూపుతున్న మీ మానవతా ధృక్పధం హర్షణీయం అని పేర్కొన్నారు.
ధృవతారగా ఎదగాలని
కార్య కుశలతో మీకు సాటిరాగల యువనాయకులు దేశంలోనే లేరనటం అతి శయోక్తి కాదని అభిప్రాయపడ్డారు. దేశానికి మీ వంటి నాయకులు అవసరం అని రామోజీ పేర్కొన్నారు. ఇంతితై మీరు దేశానికే నాయకత్వం వహించే ధృవతారగా ఎదగాలని ఈ పుట్టిన రోజు సందర్భంగా ఆశిస్తున్నానంటూ.. తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటీఆర్ కు ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు పంపిన లేఖలో ఆకాంక్షించారు.












Click it and Unblock the Notifications