ఫోన్ మిస్, మహిళా టెక్కీకి వేధింపు, బావ ఇంటి ఎదుట మరదలి దీక్ష
హైదరాబాద్: ఓ సాఫ్టువేర్ ఉద్యోగినికి ఫోన్లో వేధింపులు రావడంతో ఆమె సదరు యువకుడి పైన పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాదాపూర్కు చెందిన సిద్దు అనే యువకుడు గత కొంతకాలంగా సదరు సాఫ్టువేర్ ఉద్యోగినిని ఫోన్లో వేధిస్తున్నాడు.
పోలీసులు నిందితుడు సిద్ధూను అరెస్టు చేశారు. అతని పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా, బాధితురాలు ఇటీవల తన సెల్ఫోన్ పోగొట్టుకున్నారు. ఇది నిందితుడైన ఆకతాయికి దొరికింది. దీనిని అవకాశంగా తీసుకున్న యువకుడు సదరు యువతిని అసభ్య సందేశాలతో వేధించడం ప్రారంభించాడు.
ఆ యువతి ఫోన్లో ఉన్న ఆమె ఫోటోలు, ఇతర వ్యక్తిగత వివరాలను చూశాడు. వాటిని ఉపయోగించుకొని వేధించడం ప్రారంభించాడు. ఆమెకు అసభ్యకర సందేశాలు పంపించాడు. సెల్ ఫోన్ పోయిన విషయాన్ని పట్టించుకోని బాధితురాలు.. అతని వేధింపులతో విసిగిపోయింది.
బావ మోసం చేశాడని మరదలి పోరాటం
హైదరాబాదులోని దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో ఓ వ్యక్తి తన మరదలిని ప్రేమ పేరుతో మోసం చేశాడు. దీంతో బాధితురాలు అతని ఇంటి ముందు ధర్నాకు దిగింది. దీనిని గమనించిన నిందితుడు, కుటుంబం ఇంటి నుంచి పారిపోయింది. అయితే, ఇంటి ముందు ధర్నాకు దిగిన ఆ యువతి మాత్రం తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడే దీక్ష చేస్తానని వారి ఇంటి ముందు బైఠాయించింది.
నలుగురు బాలికల అదృశ్యం
హైదరాబాదు నగర శివారులో నలుగురు బాలికలు అదృశ్యం కావడం సంచలనం రేపింది. నగరం శివారు ప్రాంతమైన చందానగర్కు చెందిన 4గురు బాలికలు ఐదు రోజులుగా కనిపించకుండా పోవడంతో వారి తల్లిదండ్రులు ఆందోళనతో చందానగర్ పోలీసులను ఆశ్రయించారు.
వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. స్వప్న (12), పద్మ (10), రేణుక (9), కావేరి (8) చివరిగా చందానగర్ ప్రభుత్వ ఆస్పత్రి దగ్గర అయిదు రోజుల క్రితం కనిపించగా, ఆ తర్వాత వారి జాడ లేదు. దీంతో పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.