భార్యను హత్య చేసి గుండెపోటుగా చిత్రీకరణ: కాంగ్రెస్ నేత వల్లభ్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్: తన భార్యను హత్య చేసిన కేసులో యూత్ కాంగ్రెస్ నేత వల్లభ్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈయన నల్గొండ కాంగ్రెస్ నేత రంగసాయి రెడ్డి కుమారుడు. ఈ కేసుకు సంబంధించి పోలీసుల విచారణలో విస్తుగొలిపే వివరాలు బయటపడ్డాయి. మొదట గుండెపోటుతో తన భార్య చనిపోయిందని నమ్మించేందుకు వల్లభ్ రెడ్డి ప్రయత్నించారు. అయితే, పోస్టుమార్టం రిపోర్టులో మాత్రం ఆమెది హత్యేనని తేలింది.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత రంగసాయి కుమారుడు వల్లభ్ రెడ్డి యూత్ కాంగ్రెస్ నేతగా కొనసాగుతున్నాడు. కాగా, వల్లభ్ రెడ్డికి ఏడాది క్రితం లహరి అనే యువతితో వివాహం జరిగింది. వీరిద్దరూ కలిసి హిమాయత్నగర్లో నివాసం ఉంటున్నారు.
అయితే, వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి.

ఈ క్రమంలో జులై 14వ తేదీన లహరిని గుండెపోటు వచ్చిందంటూ ఆస్పత్రిలో చేర్చారు. అయితే అప్పటికే లహరి చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. గుండెపోటుతోనే లహరి చనిపోయిందని అందర్నీ నమ్మించే యత్నం చేశారు వల్లభ్ రెడ్డి, ఆయన కుటుంబం. అయితే, లహరి తండ్రికి అనుమానం రావడంతో నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
లహరి గుండెపోటుతో చనిపోలేదని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. ఆమె తలకు తీవ్రగాయం కావడంతోనే చనిపోయిందని, కడుపులో కూడా తీవ్ర గాయాలయ్యాయని తేలింది. జులై 13వ తేదీన లహరితో గొడవపడిన వల్లభ్.. ఆమెను గోడకేసి కొట్టాడు. దీంతో ఆమె తలకు తీవ్రగాయమైనట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో వల్లభ్ను కఠినంగా శిక్షించాలని లహరి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.కాగా, లహరి చనిపోయిన అనంతరం ఆమె దినకర్మకు వల్లభ్ రెడ్డి.. 10 వేల మందికి భోజనాలు కూడా పెట్టడం గమనార్హం.












Click it and Unblock the Notifications