తన భార్యతో లింక్ వద్దన్నందుకు హత్య: తల, చేతులు నరికి రిజర్వాయర్లో...
నల్లగొండ: నల్లగొండ జిల్లాలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని వారించినందుకు, దాన్ని మనసులో పెట్టుకుని నేను మారానని, ఎలాంటి గొడవలు లేకుండా ఉందామని చెప్పి స్నేహపూర్వకంగా ఉన్నట్లు నమ్మించి ఓ వ్యక్తిని మరో వ్యక్తి హత్య చేశాడు.
వ్యక్తిని చంపేసి అత్యంత కిరాతకంగా మొండెం నుంచి తలను వేరుచేసి, రెండు చేతులు నరికాడు. మొండాన్ని నిప్పు పెట్టి కాల్చి, చేతులూ తలనూ రిజర్వాయర్లో పడేశాడు. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం పర్వేదుల గ్రామపంచాయతీ పరిధిలోని పాల్తీతండాకు చెందిన పాల్తి రవి(30) తన భార్య శ్యామల, ముగ్గురు పిల్లలతో కలిసి సాగర్-హైదరాబాద్ రహదారిపై గల మహబూబ్నగర్ జిల్లా మాడ్గుల మండల పరిధిలోని అన్నెబోయినపల్లి స్టేజీ వద్ద గల వెంకటేశ్వర పౌల్ట్రీ ఫాంలో డ్రైవర్గా పని చేస్తున్నాడు.
ఇతనితో పాటు తన తండాకే చెందిన, వరుసకు బంధువైన పాల్తి శ్రీధర్ కూడా అదే ఫాంలో డ్రైవర్గా పని చేస్తున్నాడు. గతంలో రవి భార్య శ్యామలతో శ్రీధర్ వివాహేతర సంబంధం సాగిస్తున్నాడనే అనుమానంతో ఇద్దరి మధ్య గొడవలయ్యాయి. దీంతో తండా పెద్దలు సర్ది చెప్పి శ్రీధర్ను హైదరాబాద్కు పంపించారు. శ్రీధర్ అక్కడ ఉండకుండా రవి పనిచేస్తున్న పౌల్ట్రీ ఫాంలోనే తిరిగి పనికి కుదిరాడు.

రవి కుటుంబంతో స్నేహంగా ఉంటూ సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈనెల 10 సాయంత్రం శ్రీధర్, రవిని కొండమల్లేపల్లికి పని ఉందని తీసుకొచ్చాడు. అర్ధరాత్రి వరకు తన భర్త తిరిగి రాకపోవడంతో శ్రీధర్కు ఫోన్ చేసి తన భర్త ఎక్కడ అని శ్యామల అడగడంతో హైదరాబాద్ వెళ్లాడని సమాధానమిచ్చాడు.
తెల్లవారుజామున ఐదున్నర ప్రాంతంలో తను పనిచేస్తున్న పౌల్ట్రీ ఫాం వద్దకు వెళ్లి రవి హైదరాబాద్కు వెళ్లాడు, తాను డ్రైవింగ్ లైసెన్స్ కోసం మిర్యాలగూడ వెళ్తున్నానని చెప్పి వెళ్లాడు. ఆ రోజు నుంచి రవి వివరాలు తెలియకపోవడంతో అనుమానంతో పాటు శ్రీధర్ పరారీలో ఉండడంతో అతని బంధువులు మాడ్గుల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో శ్రీధర్ భయపడి రవిని హత్యచేసినట్లు తండాలోని తమ బంధువులకు ఫోన్ ద్వారా సమాచారమిచ్చాడు.
బంధువులు మృతదేహం కోసం గాలించగా కోల్ముంతల్పహడ్ గ్రామానికి వెళ్లే దారిలో కనిపించింది. విషయాన్ని దేవరకొండ పోలీసులకు సమాచారంమివ్వగా వారు సంఘటనా స్థలానికి చేరి పరిసరాలను పరిశీలించారు. కాగా, మృతదేహాన్ని చూసేందుకు మృతుడి భార్య శ్యామల అక్కడికి రావడంతో మృతుడి బంధువులు ఆగ్రహావేశంతో ఆమెపై దాడికి దిగారు.
పోలీసులు అప్రమత్తమై ఆమెను అక్కడి నుంచి పంపించారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ దవాఖానకు తరలించినట్లు సీఐ గట్టుమల్లు తెలిపారు. నిందింతుడు పోలీసుల కస్టడీలో ఉన్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications