ప్రియుడి ప్రేమ ఇలా, బ్రోతల్ హౌస్లో అ.ప్రొఫెసర్
హైదరాబాద్: ప్రియురాలు ఆత్మహత్య చేసుకోవడంతో, బాధను తట్టుకోలేక ఆమె అస్థికలు ప్రియుడు తీసుకు వెళ్లిన సంఘటన హైదరాబాదులో జరిగింది. అంబర్ పేట పరిధిలోని సాయిరామకృష్ణ, మహేశ్వరిలు ప్రేమించుకున్నారు. గత నెల 22న భరించలేని కడుపునొప్పితో మహేశ్వరి ఆత్మహత్యకు యత్నించింది.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ నెల 2వ తేదీన దహన సంస్కారాలు జరిగాయి. అస్థికలు సేకరించేందుకు బంధువులు వెళ్లగా.. అక్కడ ఏం కనిపించలేదు. కాటికాపరిని బంధువులు ప్రశ్నించారు. సాయి రామకృష్ణ వచ్చి అస్తికలు తీసుకు వెళ్లాడని చెప్పారు.
ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, తాను ఆమెను ప్రేమించానని, తాను కూడా చనిపోతానని బాధపడగా, పోలీసులు అతనికి కౌన్సెలింగ్ ఇచ్చారు. కాగా, అస్తికలు తీసుకు వెళ్లిన రోజు.. తాను ఆమె భర్తనని హంగామా చేసి తీసుకు వెళ్లాడని తెలుస్తోంది.
విమానాశ్రయ ఉద్యోగి ఆత్మహత్య
హిమయత్ సాగర్లో విమానాశ్రయ ఉద్యోగి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మొయినాబాద్ మండలం మూర్తుజాగూడలో ఉండే ఆనంద రావు విమానాశ్రయంలో ఇండిగో ఎయిర్ లైన్స్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఎప్పటిలాగే విధులు ముగించుకొని ఇంటికి వెళ్తూ మార్గమధ్యలో హిమయత్ సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలే కారణమని సమాచారం.
వ్యభిచార గృహంపై దాడి
వ్యభిచార గృహంపై దాడి చేసిన ఎస్వోటీ పోలీసులు నిర్వాహకురాలితో పాటు విటుడిని, ఇద్దరు యువతులను అరెస్టు చేసి వారిని చైతన్యపురి పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన ఆదివారం అర్ధరాత్రి జరిగింది. కొత్తకొట పరిధిలో కోల్కతాకు చెందిన మహిళ ఇల్లు అద్దెకు తీసుకొని ఇతర ప్రాంతాల నుండి యువతులను తీసుకు వచ్చి వ్యభిచారం నిర్వహిస్తోంది.
సమాచారం అందుకున్న ఎస్వోటీ పోలీసులు అర్ధరాత్రి దాడి చేసి కోల్కతాకు చెందిన ఇద్దరు యువతులతో పాటు బహదూర్ పురాకు చెందిన విటుడిని అరెస్టు చేశారు. వారి నుండి ఐదు సెల్ ఫోన్లు, రూ.1600 నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. యవతులను రెస్క్యూ హోంకు తరలించారు. కాగా, పట్టుబడ్డ వారిలో ఓ అసిస్టెంట్ ఫ్రొఫెసర్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.