తెలంగాణపై జగన్ దృష్టి, పెద్దపీట వేస్తామని కేసీఆర్
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణలో పార్టీ పటిష్టత పైన దృష్టి సారించారు. శుక్రవారం జగన్ అధ్యక్షతన లోటస్ పాండులోని క్యాంపు కార్యాలయంలో పార్టీకి చెందిన పలువురు నేతలతో జగన్ సమావేశమయ్యారు. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యల పైన చర్చించారు. ఈ భేటీలో అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు పైన జరిగిన దాడిని తెలంగాణ నేతలు ఖండించారు.
సేఫ్ అండ్ స్మార్ట్ సిటీగా హైదరాబాద్: నాయిని
హైదరాబాదును సేఫ్ అండ్ స్మార్ట్ సిటీగా చేయడమే తెలంగాణ ప్రభుత్వం లక్ష్యమని హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి అన్నారు. నేరరహిత సమాజం కోసం పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉండాలన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచుతామన్నారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు శాంతిభద్రతలకు పెద్దపీట వేస్తున్నామన్నారు. ఉపాధి కల్పన పెరిగితే నేరాలు తగ్గుతాయన్నారు. శుక్రవారం ఉదయం పీపుల్ప్లాజా వద్ద హైదరాబాద్ పోలీసులకు హోంమంత్రి నాయిని పెట్రోలింగ్ వాహనాలను పంపిణీ చేశారు.
కేసీఆర్ పైన షబ్బీర్ నిప్పులు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన కాంగ్రెస్ పార్టీ నేత షబ్బీర్ అలీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ అనుభవలేమీ వల్ల తెలంగాణ నష్టపోతోందన్నారు. ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికి ఐదు లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలన్నారు. రైతులకు ఏడు గంటల విద్యుత్ ఇవ్వాలన్నారు. రుణమాఫీ చేశామని ప్రభుత్వం చెబుతోందని, అయితే, రైతు ఖాతాలో డబ్బులే జమ కాలేదన్నారు. రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలకు పెద్దపీట: కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలకు పెద్దపీట వేస్తామని కేసీఆర్ అన్నారు. త్వరలోనే కొత్త పారిశ్రామిక విధానం రూపొందించనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో పరిశ్రమల కోసం ఐదులక్షల ఎకరాలను కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. శుక్రవారం ఉదయం స్కూలిచ్, జీఎంఆర్ సంస్థల సంయుక్త భాగస్వామ్యంలో శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన బిజినెస్ స్కూల్ను కేసీఆర్ ప్రారంభించారు.