తెలంగాణ సీఎం కేసీఆర్కు జగన్ లేఖ, ఎందుకంటే: 'ఏపీలో టీఆర్ఎస్ పోటీ చేయదు'
అమరావతి/హైదరాబాద్: ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు హైదరాబాదులో కలిసిన విషయం తెలిసిందే. దీనిపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అంతకుముందు, ఏపీకి ప్రత్యేక హోదాకు మద్దతు తెలుపుతామని కేసీఆర్ ప్రకటించారు. టీఆర్ఎస్, వైసీపీ మధ్య దోస్తీ పెరుగుతోందని చాలామంది భావిస్తున్నారు.
కూతురు కోసం లండన్ వెళ్లాలనుకున్న జగన్, హఠాత్తుగా రద్దు, ఎందుకంటే?
బదలీలపై కేసీఆర్కు జగన్ లేఖ
ఈ నేపథ్యంలో, వైయస్ జగన్ తాజాగా, శనివారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు లేఖ రాశారు. ఉద్యోగుల అంతర్రాష్ట్ర బదలీలను సత్వరమే పూర్తి చేయాలని కోరారు. మానవతా దృక్పథంతో ఆలోచించి బదలీలు చేపట్టాలన్నారు. పరస్పర బదలీలపై కమిటీ సవరణ ఉత్తర్వులను విడుదల చేయాలన్నారు. అవి వెలువడిన వెంటనే ఉద్యోగుల బదలీలు జరపాలన్నారు.
ఏపీలో తెరాస పోటీ చేయదు
కాగా, జగన్-కేటీఆర్ల భేటీపై ఏపీ టీడీపీ నేతలు విమర్శలు చేయడాన్ని వైసీపీ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రెడ్డి ఖండించారు. ఈ ఇద్దరు నేతలు కలిస్తే టీడీపీకి భయమెందుకో చెప్పాలన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని టీఆర్ఎస్ ముందుకు రావడం శుభ పరిణామం అన్నారు. ఏపీలో టీఆర్ఎస్ పోటీ చేయదన్నారు. ఏపీ ప్రయోజనాల కోసం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలను వైసీపీ స్వాగతిస్తోందని చెప్పారు. బీజేపీతో నాలుగేళ్ల పాటు అంటకాగిన చంద్రబాబు ఇప్పుడు తమ పుట్టి మునుగుతోందని పొత్తు నుంచి బయటకు వచ్చారన్నారు.
వైసీపీకి కేంద్రం ప్రత్యేక ట్రీట్మెంట్
కేసీఆర్, జగన్, మోడీలు ఒక్కటేనని, ఏపీ అభివృద్ధికి అడ్డుపడుతున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తోన్న విషయం తెలిసిందే. వారి మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని ఆరోపిస్తున్నారు. ఏపీ విషయంలో కేంద్ర ప్రభుత్వం పట్టనట్లుగా ఉందని, కానీ జగన్ విషయంలో మాత్రం ఆసక్తిని కనబరుస్తోందని టీడీపీ నేత జూపూడి ప్రభాకర రావు శనివారం మండిపడ్డారు. ఉక్కు పరిశ్రమపై తమకు అసలు సమాచారం ఇవ్వలేదని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పడం విడ్డూరమన్నారు. హోదా ఇవ్వలేమని, ప్రత్యేక ట్రీట్మెంట్ ఇస్తామంటున్న కేంద్ర ప్రభుత్వం ఆ ప్రత్యేక ట్రీట్మెంట్ అది వైసీపీకి ఇస్తోందన్నారు. జైలుకు వెళ్లాల్సిన వారిని రక్షిస్తూ రాష్ట్రం కోసం ప్రశ్నిస్తున్న టీడీపీ ఎంపీలపై ఐటీ, ఈడీ దాడులు చేస్తూ గందరగోళం సృష్టిస్తున్నారన్నారు.