YS Sharmila :షర్మిల కొత్త రాజకీయం : ఢిల్లీ కేంద్రంగా - బండికి జలక్..!!
YS Sharmila Political Steps: వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల దశ- దిశ మారుతోందా. షర్మిల కేంద్రంగా తెలంగాణ రాజకీయాలు తిరుగుతున్నాయి.3500 కిలో మీటర్ల పాదయాత్ర చేసినా రాని మైలేజ్ ఒకే ఒక్క ఘటనతో షర్మిల సొంత మైంది. తెలంగాణలో రాజకీయంగా ఒంటరి పోరాటం చేస్తున్న షర్మిలకు అనూహ్యంగా ఇతర పార్టీలతో పాటుగా గవర్నర్ మద్దతు దొరికింది.
ఢిల్లీ కేంద్రంగా బీజేపీ పెద్దలు షర్మిల ఎపిసోడ్ గురించి ఆరా తీసారు. రాష్ట్రం లోని బీజేపీ నేతలు వెంటనే సంఘీభావం ప్రకటించారు. ఇటు టీఆర్ఎస్ మరింత కార్నర్ చేస్తోంది. కవిత వర్సస్ షర్మిల ట్వీట్ల వార్ కొనసాగుతోంది. షర్మిల కేంద్రంగా రాజకీయ సమీకరణాలు మారతున్నాయి.
ఒకే ఒక్క ఘటనతో మారిపోయిన సీన్..
షర్మిల రాజన్న రాజ్యం తెస్తానంటూ తెలంగాణలో పార్టీ స్థాపించిన తరువాత ఇప్పటి వరకు రాష్ట్ర రాజకీయాల్లో ప్రభావం చూపలేకపోయారు. ఇప్పటికే 3,500 కిలీ మీటర్ల మేర పాదయాత్ర చేసారు. నిరుద్యోగులకు మద్దతుగా దీక్షలు చేసినా మైలేజ్ దక్కలేదు. టీఆర్ఎస్ నేతలే లక్ష్యంగా కొంత కాలంగా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.
దీని పైన టీఆర్ఎస్ నేతలు స్పీకర్ కు ఫిర్యాదు చేసారు. ఇక, తాజాగా షర్మిల చేసిన వ్యాఖ్యల తో గులాబీ పార్టీ కార్యకర్తలు ఆగ్రహంతో ఊగిపోయారు. షర్మిల వాహనాన్ని ధ్వసం చేసారు. పాదయాత్రలో ఉన్న షర్మిలను పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తీసుకొచ్చారు. ధ్వంసమైన తన కారులోనే షర్మిల సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ ప్రగతి భవన్ కు బయల్దేరారు.
పోలీసులు అడ్డుకోవటం..కారులో షర్మిల కూర్చొని ఉండగానే.. కారును లాక్కుంటూ వెళ్లటంతో ఒక్క సారిగా సీన్ మారిపోయింది. దీనిని బీజేపీ నేతలతో పాటుగా గవర్నర్ తప్పు బట్టారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, బండి సంజయ్ షర్మిలకు మద్దతుగా నిలిచారు. గవర్నర్ షర్మిలకు మద్దతుగా చేసిన ట్వీట్ ప్రధాని కార్యాలయానికి ట్యాగ్ చేసారు.
షర్మిల ఘటనపై ఢిల్లీ బీజేపీ నేతల ఆరా..
హైదరాబాద్ కేంద్రంగా దివంగత సీఎం వైఎస్సార్ కుమార్తె..ఏపీ సీఎం జగన్ సోదరి షర్మిల వ్యవహారం జాతీయ స్థాయిలో ప్రసారమైంది. ఈ ఘటన పైన ఢిల్లీ బీజేపీ నేతలు రాష్ట్ర నాయకులతో ఆరా తీసారు. షర్మిల ను కారులోనే ఉండగానే వాహనం లాగటం పైనే ఇప్పుడు నేతలంతా స్పందిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ తీరును తప్పుబడుతున్నారు.
కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి స్పందించారు. కొండా సురేఖ మద్దతుగా నిలిచారు. కేసీఆర్ ను వ్యతిరేకిస్తూ రోడ్డు మీదకు వచ్చిన షర్మిల పైన ఇప్పుడు ఢిల్లీ బీజేపీ దృష్టి పెట్టింది. తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కోర్టులో పోరాడి భైంసా సభకు అనుమతి తెచ్చుకున్నా.. ఆ సభ కంటే షర్మిల ఘటనకే ప్రాధాన్యత..ప్రచారం లభించింది.
దీంతో, ఎంతో ఆర్భాటంగా బీజేపీ నిర్వహించిన సభను షర్మిల వ్యవహారం డామినేట్ చేసింది. ఇదే సమయంలో బీజేపీ నేతలు టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా షర్మిలకు మద్దతుగా నిలవటం మరో ఆసక్తి కర అంశం.
షర్మిలకు బీజేపీ మద్దతు...టీఆర్ఎస్ టార్గెట్
ఈ వ్యవహారంలో షర్మిలకు బీజేపీతో పాటుగా గవర్నర్ మద్దతుగా నివటం గులాబీ పార్టీ నేతలకు అస్త్రంగా మారింది. తొలి నుంచి బీజేపీ వదిలిన బాణంగా షర్మిల గురించి వ్యాఖ్యలు చేస్తున్న టీఆర్ఎస్ నేతలు ఇప్పుడు డైరెక్టుగా అవే విమర్శలు గుప్పిస్తున్నారు. తాము వదిలిన బాణం..తానా అంటే తందానా అంటున్న తామర పువ్వులు అంటూ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేసారు.
తెలంగాణలో రాజకీయంగా ఒంటరి పోరాటం చేస్తున్న షర్మిల కాంగ్రెస్ తో జత కట్టే అవకాశం లేదు. బీజేపీతో జత కడుతారా అనే చర్చ తాజా పరిణామాలతో మొదలైంది. కేసీఆర్ పైన పోరాటం చేసే ఎవరికైనా మద్దతిచ్చేందుకు బీజేపీ సిద్దంగా ఉంది. అదే సమయంలో షర్మిల బలం - ఓటింగ్ గురించి బీజేపీ ఆరా తీస్తోంది.
అటు ఏపీలో అన్న ఇప్పటికే బీజేపీతో పొత్తు లేకపోయినా కేంద్రంతో సఖ్యతగా ఉంటున్నారు. మరి...బీజేపీ వ్యవహారంలో షర్మిల ఏం చేస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది. తెలంగాణలో ముందస్తు ప్రచారం వేళ..ఈ పరిణామాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి.