ఈటల రాజేందర్ ఉద్యమకారుడైతే, కేసీఆర్ అవినీతిపై ఆ పనిచెయ్యాలని ఈటలకు వైఎస్ షర్మిల సవాల్!!
వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్న షర్మిల కరీంనగర్ జిల్లా మంత్రి గంగుల కమలాకర్ ను, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. తాజాగా హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న షర్మిల ఈటల రాజేందర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈటల రాజేందర్ కేసీఆర్ అవినీతి గురించి ఎందుకు మాట్లాడరు? వైఎస్ షర్మిల ప్రశ్న
టిఆర్ఎస్ పార్టీలో ఈటల రాజేందర్ కీలకంగా పని చేశారని, మంత్రిగా కూడా పదవిని వెలగబెట్టారని పేర్కొన్న షర్మిల, పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత అయినా ఈటల రాజేందర్ కేసీఆర్ అవినీతి గురించి ఎందుకు మాట్లాడడం లేదో చెప్పాలని వైయస్ షర్మిల ప్రశ్నించారు. కెసిఆర్ తో ఏడేండ్లు నడిచిన ఈటల రాజేందర్.. కెసిఆర్ అవినీతిని ఎందుకు బయటపెట్టడం లేదని నిలదీశారు.

కేసీఆర్ అవినీతి బయటపెడితే మీ అవినీతి బయటపడుతుందా?
ఒకవేళ కేసీఆర్ అవినీతి బయట పెడితే మీ అవినీతి బయట పడుతుందనా? అంటూ వైఎస్ షర్మిల ఈటల రాజేందర్ ను టార్గెట్ చేశారు. మీరు నిజంగానే ఏ తప్పు చేయకుంటే ఒంటరిగా పోటీ చేయకుండా, బీజేపీలో ఎందుకు చేరినట్టు? అని వైయస్ షర్మిల ప్రశ్నించారు. కేసీఆర్ అవినీతిలో ఈటల కు భాగం ఉందని వైయస్ షర్మిల ఆరోపించారు. కమ్యూనిస్టు భావజాలాన్ని పక్కనపెట్టి బిజెపిలో చేరాల్సిన అవసరం ఏమి వచ్చిందో చెప్పాలని ఈటల రాజేందర్ ను ప్రశ్నించారు. టిఆర్ఎస్ పార్టీలో ఉన్న ఈటల రాజేందర్ ను, ఎంతో అవమానకర రీతిలో వెళ్లగొట్టినా కేసీఆర్ అవినీతి గురించి ఈటల రాజేందర్ ఇప్పటి వరకు నోరు మెదపలేదని వైయస్ షర్మిల ఆరోపించారు.
ఈటల రాజేందర్ కు వైఎస్ షర్మిల సవాల్..
బీజేపీలో చేరకుండానే ఈటల రాజేందర్, స్వతంత్రంగా ఎన్నికల్లో పోటీ చేసినా నియోజకవర్గ ప్రజలు ఆయనను గెలిపించే వారని పేర్కొన్న వైయస్ షర్మిల ఈటల బీజేపీలో చేరాల్సిన అవసరం ఏమిటో చెప్పాలని నిలదీశారు. కేవలం కేసులనుండి కాపాడుకోవడం కోసమే, అరెస్ట్ ల నుండి తప్పించుకోవటం కోసమే ఈటల రాజేందర్ బిజెపిలో చేరారని వైయస్ షర్మిల అభిప్రాయపడ్డారు. ఈటల రాజేందర్ నిజంగా ఉద్యమకారుడు అయితే, ఈటల రాజేందర్ నిజాయితీపరుడు అయితే, అవినీతి చెయ్యకపోతే వైయస్సార్ తెలంగాణ పార్టీతో చేతులు కలిపి కెసిఆర్ అవినీతిపై మాట్లాడాలని వైయస్ షర్మిల సవాల్ విసిరారు. ఇప్పటికైనా ఈటల రాజేందర్ నోరు విప్పాలని వైయస్ షర్మిల డిమాండ్ చేశారు.
బండి సంజయ్ పైనా ఆగ్రహం
అంతేకాదు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పైన వైయస్ షర్మిల నిప్పులు చెరిగారు. బండి సంజయ్ కార్పొరేటర్ స్థాయి నుంచి కోట్లకు పడగలెత్తాడు అని మండిపడ్డారు. మత రాజకీయాలు చేస్తూ, రాజకీయ పబ్బం గడుపుతున్నాడని అసహనం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డిలాగే కాళేశ్వరంలో ముడుపులు అందుకున్నాడు కాబట్టే కాళేశ్వరం అవినీతిపై బండి సంజయ్ నోరు విప్పడం లేదని వైయస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. మొత్తంగా వైయస్ షర్మిల ఏ నియోజకవర్గానికి వెళ్లినా, అక్కడ ప్రత్యర్థి పార్టీల ఎమ్మెల్యేలను, ఎంపీలను తూర్పారబడుతూ, ప్రజాక్షేత్రంలో ప్రజల మద్దతును పొందడం కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. తన వాక్చాతుర్యంతో ప్రజలను ఆలోచించేలా చేస్తున్నారు.












Click it and Unblock the Notifications