మోడీ రాష్ట్రానికి వస్తే పిల్లిని చూసిన ఎలుకలా కేసీఆర్ .. ఇప్పుడేమో ధర్నాల డ్రామాలు: వైఎస్ షర్మిల
వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల తెలంగాణ సీఎం కేసీఆర్ తీరుపై నిత్యం విరుచుకుపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో యాసంగి ధాన్యాన్ని కొనాలని కేంద్రంపై టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆందోళనలపై షర్మిల తనదైన శైలిలో స్పందించారు. తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్, తెలంగాణ మంత్రులు డ్రామాలాడుతున్నారు అంటూ వైయస్ షర్మిల విరుచుకుపడ్డారు.
రైతులతో కలిసి వైఎస్ షర్మిల ధర్నా
వైయస్సార్ టిడిపి చీఫ్ వైయస్ షర్మిల పాదయాత్ర ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలం లో సాగుతోంది. ఈ సందర్భంగా చేగొమ్మ గ్రామంలోని రైతు వేదిక వద్ద గురువారం రైతులతో కలిసి వైఎస్ షర్మిల ధర్నా నిర్వహించారు.
తెలంగాణ రైతాంగం పండించిన యాసంగి వడ్లను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. గతంలో అసెంబ్లీ సాక్షిగా రైతులు పండించిన చివరి గింజ వరకు కొంటామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని గుర్తు చేసిన వైయస్ షర్మిల, ఇప్పుడు వడ్లు కొనుగోలు చెయ్యలేమని చెప్పి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ మండిపడ్డారు.
వడ్ల కొనుగోలు నెపంతో కేసీఆర్ ఢిల్లీ రాజకీయాలు
వడ్ల కొనుగోలు నెపంతో ఢిల్లీ రాజకీయాలు మొదలు పెట్టారని వైయస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్ సంతకు రైతుల పాలిట మరణశాసనం రాసిందని, ఒక్క సంతకం లక్షల మంది రైతుల గుండెకోతకు కారణమైందని వైయస్ షర్మిల పేర్కొన్నారు. సంతకం దొరగారిది.. చావు రైతులది అంటూ వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాజాగా ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసిన షర్మిల ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం సంతకం పెట్టుమన్నప్పుడు కెసిఆర్ ఎందుకు ధర్నా చేయలేదని ప్రశ్నించారు.
మోడీ రాష్ట్రానికి వస్తే పిల్లిని చూసిన ఎలుక దాక్కున్నట్టు కేసీఆర్ తీరు
ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి వస్తే పిల్లిని చూసిన ఎలుక దాక్కున్నట్టు కెసిఆర్ దాక్కున్నారు అంటూ ఎద్దేవా చేశారు . ఇక ఇప్పుడు ధర్నాల పేరుతో టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు డ్రామాలాడుతున్నారని వైయస్ షర్మిల మండిపడ్డారు. ధర్నాలు చేయడానికి అయినా మిమ్మల్ని గెలిపించింది అంటూ వైయస్ షర్మిల ప్రశ్నించారు. ఇక రైతులతో ఏదీ మాట్లాడకుండా, రైతుల అనుమతి లేకుండా కెసిఆర్ ఎలా సంతకం పెట్టారంటూ వైయస్ షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Recommended Video
కేంద్రానికి లేఖ రాసింది కేసీఆర్ నే... అపర మేధావికి ఆ విషయం తెలియదా?
బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని సీఎం కేసీఆర్ స్వయంగా కేంద్రానికి లేఖ రాసి, రైతుల్ని నట్టేట ముంచాడు అని మండిపడ్డారు. కేసీఆర్ సంతకం రైతులకు మరణశాసనమైంది.యాసంగిలో బాయిల్డ్ రైస్ వస్తుందని తెలిసి కూడా కేంద్రానికి బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని ఎలా లేఖ రాశారు? అని షర్మిల ప్రశ్నించారు. 80వేల పుస్తకాలు చదివిన అపరమేధావికి ఈ విషయం తెలియదా? అంటూ ఎద్దేవా చేశారు.
కేసీఆరే వడ్లన్నీకొనుగోలు చేయాలని షర్మిల డిమాండ్
కేసీఆర్ లేఖ వల్లనే కేంద్రం వడ్లు కొనమని చెబుతోంది అంటూ పేర్కొన్నారు. అందువల్ల కేసీఆరే వడ్లన్నీకొనుగోలు చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. తెలంగాణా రైతాంగాన్ని మోసం చేసే ధర్నాలు ఆపాలని షర్మిల పేర్కొన్నారు. వరి వేసుకునే హక్కు రైతులకు ఉంది.దాన్ని కాలరాసే అధికారం ఎవరికీ లేదని పేర్కొన్నారు షర్మిల. కేసీఆర్ తప్పులకు రైతులను శిక్షించడం న్యాయం కాదని, కేసీఆర్ బేషరతుగా ముక్కునేలకు రాసి రైతులకు క్షమాపణ చెప్పాలని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.