దొరగారి ఎడమకాలి చెప్పుకింద ఆత్మగౌరవం: ‘కల్వకుంట్ల’ అంటూ వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు
ఖమ్మం: తాను తెలంగాణ ఉద్యమాన్ని గౌరవిస్తానని వైఎస్ షర్మిల అన్నారు. తెలంగాణ కోసం అనేక మంది ప్రాణాలు త్యాగం చేశారని, వారి ప్రాణాలు పోకుండానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బాగుండేదని అన్నారు. ఖమ్మంలో ప్రజా సంకల్ప సభలో ఆమె మాట్లాడారు. తెలంగాణ సాధించుకుని ఏడేళ్లైందని.. ఇంకా బంగారు తెలంగాణ కాలేదని అన్నారు.
రైతు ఆత్మహత్యల తెలంగాణగా మార్చారు..
తెలంగాణ రాష్ట్రంలో 6వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని షర్మిల తెలిపారు. ఇటీవలే ఓ కౌలు రైతు కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిందని చెప్పారు. రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉందన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు రాకపోవడంతో నిరుద్యోగ యువత కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 30 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడినా కేసీఆర్ సర్కారుకు కచీమకుట్టినట్లయినా లేదని దుయ్యబట్టారు.
కేసీఆర్ పాలనలో ప్రాణాలకు విలువేది? అంటూ షర్మిల
హైకోర్టు లాయర్లను నడిరోడ్డుపై హత్య చేసినా.. చర్యలేవని ప్రశ్నించారు షర్మిల. వారి ప్రాణాలకు విలేవదన్నారు. పోడు భూమి కోసం పోరాడిన గిరిజనుల మహిళను బట్టలూడదీసి కొట్టినా సర్కారు స్పందించడం లేదని మండిపడ్డారు. అందుకే మన పార్టీ తెలంగాణలో అవసరమని అన్నారు. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూశాం.. జీతాలు పెంచమంటే.. తమ అభ్యర్థులను గెలిపిస్తేనే పీఆర్సీ అంటూ బెదిరించి ఓట్లు వేయించుకున్నారని షర్మిల.. కేసీఆర్ సర్కారుపై మండిపడ్డారు.
దొరగారి ఎడమకాలి చెప్పుకింద ఆత్మగౌరవం..
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దొరగారి(కేసీఆర్) ఎడమకాలి చెప్పుకింద నలిగిపోతోందని షర్మిల దుయ్యబట్టారు. తెలంగాణ ఎవరి కోసం తెచ్చుకున్నామని ప్రశ్నించారు. నీళ్లు కేసీఆర్ ఫాంహౌస్కు .. నిధులు కేసీఆర్ కుటుంబానికి.. నియామకాలు కేసీఆర్ ఇంటికి అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రగతిభవన్ దాటడం లేదని ఆరోపించారు. అవసరం కోసం అందర్నీ వాడుకున్నారని.. పాలనకొచ్చేసరికి దొరగారి కుటుంబమే ముందుంటుందని అన్నారు. ఉద్యమకారులను కేసీఆర్ పక్కనపెట్టారని.. ఇప్పుడు ఆయన చుట్టూ భజన బ్యాచే ఉందన్నారు.
ఉద్యమనాయకుడు కేసీఆర్ పాలన బాగుంటుందనుకున్నా.. షర్మిల
ఓ విలేఖరి తనను పార్టీ ఇప్పుడెందుకు పెడుతున్నారని అడిగితే.. ఎందుకు పెట్టకూడదంటూ తాను ప్రశ్నించానని చెప్పారు షర్మిల. కేసీఆర్ ఉద్యమనాయకుడు కావడంతో ఆయన నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుందనుకున్నానని.. అయితే అలా జరగడం లేదని షర్మిల చెప్పారు. కేసీఆర్ తప్పు చేస్తే ముక్కు రాస్తానని అన్నాడని గుర్తు చేశారు. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలకు న్యాయం జరగలేదని, బంగారు తెలంగాణ సాకారం కాలేదని అన్నారు.
Recommended Video
కల్వకుంట్ల ఫ్యామిలీకి తెలంగాణ బానిసైందా?
కల్వకుంట్ల ఫ్యామిలీకి తెలంగాణ రాష్ట్రం బానిసైందా? అని ప్రశ్నించారు. దొర దయతలచి ఇస్తే తీసుకోవాలి.. లేదా మూసుకోవాలి అన్నట్లుగా ఉందన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలకే కేసీఆర్ అపాయింట్మెంట్కు దిక్కులేదన్నారు. దొర చెప్పిందే వేదం.. దొర నంది అంటే నంది.. పంది అంటే పంది అని ఎద్దేవా చేశారు. దొర బాంచన్ అనేవాడికే పదవి అని అన్నారు. ఎన్నికలకు ముందు ఒక మాట, తర్వాత ఒక మాట్లాడటం కేసీఆర్కు అలవాటేనని అన్నారు.