బంగారు తెలంగాణ కాకుండా బార్ల బీర్ల తెలంగాణగా మార్చారు.!సూర్యాపేటలో కేసీఆర్ పై శివాలెత్తిన షర్మిళ.!
హైదరాబాద్ : సూర్యాపేట జిల్లా కోదాడ నియోజక వర్గంలో వైయస్సార్ టీపీ అద్యక్షురాలు వైయస్ షర్మిళ పాదయాత్ర కొనసాగుతోంది. పాదయాత్రలో వైయస్ షర్మిళ తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. నియోజక వర్గంలోని సమస్యలను తెలుసుకుని పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నారు షర్మిళ. అంతే కాకుండా సమస్యల పరిష్కారంలో చంద్రశేఖర్ రావు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు వైయస్ షర్మిళ. మండల ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు వైఎస్ షర్మిళ.
అద్వాన్నంగా విద్యాసంస్థలు.. సూర్యపేట జిల్లాలో కేసీఆర్ పై షర్మిళ ఫైర్
పథకాలు లేవు కానీ పన్నులు మాత్రం భారీగా వసూలు చేస్తున్నారని, తెలంగాణలో విద్యా వ్యవస్థ అధ్వాన్నంగా తయారయ్యిందన్నారు వైయస్ షర్మిళ. ప్రభుత్వ పాఠశాలలు అంటే ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు లెక్క లేదని, చట్టసభల్లో చెప్పేది ఒకరంకంగా ఉంటే క్షేత్ర స్దాయిలో పరిస్ధితులు విరుద్దంగా ఉన్నాయన్నారు షర్మిళ. పాఠశాలల భవనాలు కూలి పోయే పరిస్థితిలో ప్రమాదకరంగా ఉన్నాయన్నారు. విద్యార్థులకు మంచి నీళ్ళు దొరకడం లేదు గానీ, మద్యం ఏరులై పారుతుందన్నారు షర్మిళ. గుడులు బడుల కన్నా వైన్స్ షాపులు, బెల్ట్ షాపులు ఎక్కువగా ఉన్నాయని మండిపడ్డారు.
బంగారు తెలంగాణ కాదు.. కేసీఆర్ బీర్ల బార్ల తెలంగాణగా మార్చారన్న షర్మిళ
బంగారు తెలంగాణ అని చెప్పి బార్ల తెలంగాణ, బీర్ల తెలంగాణగా మార్చారని షర్మిళ ధ్వజమెత్తారు. చంద్రశేఖర్ రావు ఆయన బిడ్డలు, టీఆరెఎస్ పార్టీ నేతలు తప్ప తెలంగాణలో ఎవ్వరూ బాగుపడలేదని షర్మిళ ఆగ్రహం వ్యక్తం చేసారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కనీసం పరామర్శించని చంద్రశేఖర్ రావు లక్షల ఉద్యోగాలు ఎలా ఇస్తారని షర్మిళ ప్రశ్నించారు. కేవలం డబ్బు సంపాదించుకోవడమే సింగిల్ అజెండాతో సీఎం చంద్రశేఖర్ రావు, ఆయన మంత్రులు ముందుకు వెళ్తున్నారని షర్మిళ మండిపడ్డారు.
రెండు సార్లు సీఎం అయ్యారు.. ఐనా కేసీఆర్ సమస్యలు పరిష్కరించలేదన్న షర్మిళ
చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రి అయినా కూడా సమస్యలు పరిష్కరించబడ లేదన్నారు షర్మిళ. ఇచ్చిన ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదని ధ్వజమెత్తారు. ఈ దిక్కుమాలిన రాష్ట్రంలో పెన్షన్ ఇచ్చే దిక్కు కూడా లేదని, పెద్ద కొడుకుగా పెన్షన్ లు ఇస్తామని చంద్రశేఖర్ రావు గతంలో చెప్పారని, పెద్ద కొడుకు అయితే ఇంట్లో ఎంత మంది వృద్దులు ఉంటే అందరికీ పెన్షన్ ఇవ్వాలి కానీ చంద్రశేఖర్ రావు లాంటి పెద్ద కొడుకు ఎవరికి ఉండొద్దన్నారు షర్మిళ.
బీరు బిర్యినీకి మోసపోవద్దు.. ఓటును ఆయుధంగా మార్చుకోవాలన్న షర్మిళ
అంతే కాకుండా నాలుగేళ్లుగా పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నట్లు పాదయాత్ర లో వృద్దులు చెప్తున్నారని, చంద్రశేఖర్ రావు కేవలం ఓట్ల కోసమే మంచి మంచి వాగ్ధానాలు చేస్తారు తప్ప వాటిని అమలు చేయరన్నారు షర్మిళ. చంద్రశేఖర్ రావు ప్రజలను ఓట్ల కోసమే వాడుకుంటారు తప్ప మరొకటి కాదన్నారు. చంద్రశేఖర్ రావు ఈ సారి ఎన్నికల్లో బాగా డబ్బులు పంచుతాడని, ఆ డబ్బులు తీసుకోవాలని, ఆ డబ్బులు కాళేశ్వరం ప్రాజెక్టులో దోచుకున్నవేనన్నారు షర్మిళ. బిర్యానీ ప్యాకెట్ కో,మందు సీసా కో లొంగిపోవద్దని షర్మిళ పిలుపునిచ్చారు.