అన్న బాటలోనే చెల్లి: షర్మిల పార్టీ జెండా..అజెండా అచ్చంగా: వైసీపీ రంగుల్లో పతాకం: వారంలో
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల.. తెలంగాణ రాజకీయాల్లో అరంగేట్రం చేయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను ఒక్కటొక్కటిగా పూర్తి చేసుకుంటోన్నారు. పార్టీ పేరును అధికారికంగా ప్రకటించడానికి నెల రోజుల కూడా సమయం లేకపోవడంతో.. దీనికి సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేశారు. పార్టీ పేరును ప్రకటించడానికి ముందే.. కేంద్ర ఎన్నికల కమిషన్ వద్ద పేరు రిజిస్టర్ చేయించనున్నారు. మరో వారం రోజుల్లో ఈ పనులు మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి.

మూడు రంగుల్లో జెండా..
ఏపీలో అధికారంలో ఉన్న తన అన్న వైఎస్ జగన్ నెలకొల్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరహాలోనే జెండా.. అజెండా ఖరారు చేసే అవకాశాలు లేకపోలేదు. వైఎస్సార్సీపీ జెండాను పోలిన విధంగా మూడు రంగుల్లో తమ పార్టీ పతాకానికి రూపకల్ప చేస్తున్నారామె. పార్టీ జెండాలో ఆకుపచ్చ, నీలం, తెలుపు లేదా పసుపు మిశ్రమం ఉండొచ్చని తెలుస్తోంది. ఆకుపచ్చ, నీలం రంగులు ఖాయం చేశారు. మూడు రంగుగా తెలుపు లేదా పసుపు..ఈ రెండింట్లో ఏదో ఒకటి ఖరారు చేస్తారని అంటున్నారు. తెలుపు కంటే పసుపు వైపే షర్మిల మొగ్గు చూపుతారని తెలుస్తోంది. పార్టీ జెండాలో తెలుపును చేర్చితే.. అచ్చంగా అది వైసీపీని పోలి ఉంటుందని వైఎస్ షర్మిల భావిస్తున్నట్లు సమాచారం.

వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా అజెండా..
వైఎస్ షర్మిల పార్టీ పార్టీ విధి విధానాలు కూడా దాదాపు వైసీపీని పోలి ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ఏపీలో మెజారిటీ ప్రజలను ఆకర్షించేలా ఉన్న వైసీపీ విధానాలను తెలంగాణలోనూ అమలు చేసేలా నిర్ణయాలను తీసుకుంటారని చెబుతున్నారు. సామాజిక, ఆర్థికపరంగా ఏపీ, తెలంగాణ మధ్య కొంత వ్యత్యాసం ఉన్నందున.. దానికి అనుగుణంగా, క్షేత్రస్థాయి పరిస్థితులు, వాస్తవాలను ప్రతిబింబించేలా పార్టీ విధి విధానాలను ఖరారు చేస్తారని సమాచారం.

సుదీర్ఘకాలం పాటు మనుగడ సాగించేలా..
ఏ రాజకీయ పార్టీ అయినా సుదీర్ఘకాలం పాటు మనుగడ సాగించడానికి, ఇతర పక్షాలకు చెందిన నాయకులను ఆకర్షించడానికి విధి విధానాలే కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే- వాటి రూపకల్పనలో వైఎస్ షర్మిల ఆచితూచి వ్యవహరిస్తోన్నారని అంటున్నారు. పార్టీకి మూలస్తంభంగా భావించే విధి విధానాలకు రూపకల్పన చేయడంలో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలను తీసుకోకూడదని ఆమె భావిస్తున్నట్లు చెబుతున్నారు. తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజల మనోభావాలను గౌరవించేలా, వాటిని ప్రతిఫలింపజేసేలా విధానాలు ఉంటాయని సమాచారం. ఆత్మీయ సమావేశాల సందర్భంగా దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఆమె సేకరిస్తోన్నారు.

ఖమ్మంలో సభ
తన రాజకీయ రంగ ప్రవేశాన్ని ప్రకటించడానికి షర్మిల ఖమ్మంను ఎంచుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. నిజానికి- ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఎక్కువసంఖ్యలో ఉన్నారు. 2014 నాటి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఒక లోక్సభ, రెండు శాసనసభ స్థానాలను గెలచుకుంది ఈ జిల్లాలోనే. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం, తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభంజనం, ఆంధ్రోళ్ల పార్టీ అనే ప్రతికూల పరిస్థితుల్లోనూ వైఎస్సార్సీపీ.. ఇక్కడ విజయం సాధించడం అప్పట్లో సంచలనం రేపింది. ప్రస్తుతం టీఆర్ఎస్లో కొనసాగుతోన్న పొంగులేటి శ్రీనివాస రెడ్డి.. వైసీపీ అభ్యర్థిగా ఖమ్మం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు, వైసీపీ సానుభూతిపరులు పెద్ద సంఖ్యలో ఉన్నందు వల్లే ఆమె తన రాజకీయ రంగ ప్రవేశం కోసం ఖమ్మాన్ని ఎంచుకున్నట్లు అంచనా వేస్తోన్నారు.












Click it and Unblock the Notifications