వరదలపై విదేశీకుట్ర సమాచారం సరే.. వరదనష్టం సమాచారం అందలేదా కేసీఆర్ దొరా? వైఎస్ షర్మిల
తెలంగాణ సీఎం కేసీఆర్ పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాజాగా కేసీఆర్ చేసిన వరదలపై విదేశీ కుట్ర కామెంట్స్ పై ఇప్పటికే బండి సంజయ్, రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. ఇక వర్షాలు, వరదలతో జనజీవనం అతలాకుతలం అయితే, అపార పంట నష్టం జరిగితే సీఎం కేసీఆర్ గడీ నుండి బయటకు రావడం లేదని మండిపడిన వైయస్ షర్మిల, తాజాగా సీఎం కేసీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో, భద్రాచలంలో వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో పర్యటించిన తీరుపై, అక్కడ ఆయన చేసిన వరదల వెనుక విదేశీ కుట్ర వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఇన్నాళ్ళ వరదల తర్వాత దొరకు ఇప్పుడు తీరిక దొరికిందా? వైఎస్ షర్మిల
వరదల వెనక క్లౌడ్ బరస్ట్ ఉందని, విదేశీ కుట్రలు జరుగుతున్నాయని సమాచారం ఉందని పేర్కొన్న సీఎం కేసీఆర్ పై సెటైర్లు వేసిన వైయస్ షర్మిల విదేశీ కుట్రల మీద సమాచారం ఉన్న దొరకు వరద నష్టం మీద ఎంత సమాచారం అందిందో చెప్పాలంటూ పేర్కొన్నారు. వారం రోజుల వర్షాల తరువాత దొరకు ఇప్పుడు తీరిక దొరికిందా అంటూ షర్మిల ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా వరద బాధితులను చూడడం కోసం దొర గడి నుండి బయట అడుగు పెట్టారని, ఏరియల్ సర్వే నిర్వహించారని పేర్కొన్న షర్మిల, ఇక ఆపై రాష్ట్రంపై విదేశీ కుట్ర జరుగుతోంది అంటూ సెలవిచ్చారు అంటూ సెటైర్లు వేశారు.

కాకమ్మ కబుర్లు చెప్పటంలో కేసీఆర్ దిట్ట : షర్మిల
సీఎం కేసీఆర్ కాకమ్మ కబుర్లు చెప్పడం లో ఆరితేరిన వ్యక్తని పేర్కొన్న వైయస్ షర్మిల వానలు, వరదలకు క్లౌడ్ బరస్ట్ కారణమని చెప్పడం బోడి గుండుకు మోకాలికి ముడి వేసినట్టు ఉందంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రజలు లక్షల్లో ఆస్తినష్టం జరిగి, గూడు లేక, తిండి అందకుండా ఇబ్బందులు పడుతుంటే సీఎం కేసీఆర్ పది వేల రూపాయల సహాయం ప్రకటించాడని పేర్కొన్నారు. కనీసం ఇదైనా వారికి అందుతుందా సారు అంటూ సెటైర్లు వేశారు వైయస్ షర్మిల.

కెసీఆర్ వరద బాధితులకు ఇచ్చింది గతంలోలా ఉత్త హామీనేనా?
జిహెచ్ఎంసి లో వరద సాయం పేరుతో మీ గులాబీ లీడర్లు మింగినట్టు మింగుతారా అంటూ ప్రశ్నించారు వైయస్ షర్మిల. ఇక గతంలో వరంగల్లో ఇస్తామని మరిచిపోయినట్టు ఇది కూడా ఉత్త హామీనేనా అంటూ వైయస్ షర్మిల ప్రశ్నించారు. అంతకు ముందు రాష్ట్రంలో వర్షాలు, వరదల దెబ్బకు 15 లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోతే రైతులను ఓదార్చినోళ్లు లేరని షర్మిల మండిపడ్డారు . జనం వరదల్లో కొట్టుకుపోతున్నా సాయం చేసిన దిక్కు లేదని వైఎస్ షర్మిల ప్రభుత్వ తీరును టార్గెట్ చేశారు. ప్రజలు గగ్గోలు పెడుతుంటే పట్టించుకోవాల్సిన పని లేదన్నట్టుగా పాలన గాలికొదిలేసి ఇతర రాష్ట్రాల సీఎంలతో పిచ్చాపాటి పాలిటిక్స్ చర్చిస్తున్నారు కేసీఆర్ దొరగారు అంటూ సెటైర్లు వేశారు షర్మిల.












Click it and Unblock the Notifications