మీరంతా మా కుటుంబం, అండగా ఉంటాం: వైయస్ షర్మిల భరోసా
హైదరాబాద్: అధైర్యపడవద్దని, మీరంతా మా కుటుంబమేనని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైయస్ షర్మిల అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి అకాల మృతికి తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను పరామర్శించడానికి ఆమె సోమవారం వరంగల్ జిల్లాలో పర్యటించారు. వరంగల్ జిల్లాలో ఆమె చివరి విడత పరామర్శ యాత్ర కొనసాగుతోంది.
చివరి విడత పరామర్శ యాత్రలో ఆమెను 11 కుటుంబాలను ఆమె పరామర్సిస్తారు. సోమవారం ఉదయం ఆమె లోటస్ పాండ్ నుంచి మంగపేట మండలం బండారిగూడెం చేరుకున్న షర్మిల ఆ గ్రామంలోని దోమంగడి ముత్తయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఆ తర్వాత అదే మండలం రాజుపేటలోని దుబ్బ ముత్తయ్య కుటుంబాన్ని, గోవిందరావుపేట మండలం దుంపెల్లి గూడెంలో దేవిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబాన్ని, సల్వాయిలోని మేడిపల్లి అమ్మయ్య కుటుంబాన్ని ఓదార్చారు.
తొలి దశలో 32 కుటుంబాలను, రెండో దశలో 30 కుటుంబాలను షర్మిల పరామర్శించారు. మంగళవారం సాయంత్రం ఆమె పరామర్శ యాత్ర భూపాలపల్లి మీదుగా సాగి కరీంనగర్ జిల్లాలో ప్రవేశిస్తుంది.