మునుగోడులో ఉపఎన్నికల పేరుతో అభివృద్ధా? సిగ్గుచేటు: బీజేపీ, టీఆర్ఎస్ లను ఏకిపారేసిన వైఎస్ షర్మిల
వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ప్రజాక్షేత్రంలోకి వెళుతూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడంతో పాటుగా రాష్ట్రంలోని టిఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను, ప్రధాన పార్టీల పరిస్థితిని తెలియజేస్తూ తనదైన శైలిలో తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యంగా సీఎం కేసీఆర్ ను రాష్ట్రంలోని అనేక సమస్యలపై నిలదీస్తున్న వైయస్ షర్మిల, తాజాగా మరోమారు ఉపఎన్నికలు వస్తే అభివృద్ధి జరుగుతుందని వస్తున్న వ్యాఖ్యలపై, జరుగుతున్న ప్రచారంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
మునుగోడు ఉపఎన్నికపై వైఎస్ షర్మిల షాకింగ్ కామెంట్స్
తెలంగాణ రాష్ట్రంలోని నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన తెలంగాణ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో పాదయాత్రలో పాల్గొన్నారు. మక్తల్ బస్ స్టాండ్ సెంటర్ వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించి టిఆర్ఎస్, బిజెపి నేతలపై వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. అభివృద్ధి కోసం పార్టీ మారానని చెప్పుకోవడం జనాలకు ఫ్యాషన్ అయిపోయింది అంటూ వైయస్ షర్మిల విరుచుకుపడ్డారు. మునుగోడు లో ఇప్పుడు ఉప ఎన్నికలట, అభివృద్ధి కోసమే ఆ ఎమ్మెల్యే బీజేపీ లోకి వెళుతున్నాడట అంటూ వైయస్ షర్మిల తనదైన శైలిలో సెటైర్లు వేశారు.
స్వార్ధ రాజకీయాల కోసం పార్టీలు మారుతూ అభివృద్ధి కోసం అంటారా ?
బీజేపీలోకి వెళితే ఏం అభివృద్ధి జరుగుతోందో చెప్పాలని వైయస్ షర్మిల ప్రశ్నించారు. బిజెపి ఎంపీ ఒకరు పసుపు బోర్డు తీసుకువస్తానని ఓట్లు వేయించుకున్నారు అని, ఇప్పటివరకు తీసుకువచ్చాడా అంటూ ప్రశ్నించారు వైయస్ షర్మిల. బిజెపి పసుపు బోర్డు కూడా ఇవ్వకుండా ఏ అభివృద్ధి చేసిందో చెప్పాలంటూ వైయస్ షర్మిల నిప్పులు చెరిగారు. అసలే అభివృద్ధి జరుగుతుందని బీజేపీలోకి వెళుతున్నారో చెప్పాలని ప్రశ్నించిన వైయస్ షర్మిల మీ రాజకీయాల కోసం, మీ కాంట్రాక్టుల కోసం, స్వార్ధం కోసం, డబ్బుల కోసం పార్టీలు మారుతున్నారు అంటూ వైయస్ షర్మిల తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.
మునుగోడులో నాయకులను కొనుగోలు చేస్తున్నారన్న వైఎస్ షర్మిల
ఇలా స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీ మారడానికి సిగ్గుండాలి అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని వైయస్ షర్మిల టార్గెట్ చేశారు. మునుగోడు లో ఒక సర్పంచ్ ను కొనాలి అంటే కార్లు గిఫ్ట్ గా ఇచ్చి కొంటున్నారట సిగ్గుచేటు.. వీళ్లా రాజకీయ నాయకులు అంటూ తీవ్ర స్థాయిలో వైయస్ షర్మిల ధ్వజమెత్తారు. అసలు ఈ ఎన్నికలు ఎవరికోసం వస్తున్నాయి అని షర్మిల ప్రశ్నించారు. రాజకీయాల కోసం కోట్లు ఖర్చు పెడుతున్నారు అంటూ షర్మిల ధ్వజమెత్తారు.
తెలంగాణాకు కేసీఆర్ చేసింది అన్యాయమే
ఇక సీఎం కేసీఆర్ తెలంగాణ రైతాంగానికి అన్యాయం చేశాడని మండిపడ్డ షర్మిల, తన అవినీతి కోసం లక్షల కోట్ల రూపాయలు ప్రాజెక్టులకు ఖర్చు పెట్టినట్టు కెసిఆర్ చూపించాడు అంటూ మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి అంచనా పెంచాడని, కమీషన్లు దోచుకున్నాడు అని పేర్కొన్నారు. కానీ ప్రాజెక్టు మాత్రం పూర్తి చేయలేదని షర్మిల వెల్లడించారు. పక్క రాష్ట్రంలోని వాళ్లు, మేం అన్నదమ్ముళ్లం.. కృష్ణా నీళ్ళ లొల్లి మేమే తేల్చుకుంటామని కెసిఆర్ చెప్పారని.. ఇప్పుడేమో కేంద్రం మీద నెపం వేసి పాలమూరుకు అన్యాయం చేశాడని వైయస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజల కోసమే ప్రజా ప్రస్థానం పాదయాత్ర చేస్తున్నానన్న వైఎస్ షర్మిల
జనం బాధలు వినేందుకు, వారికి భరోసా ఇచ్చేందుకు తన పాదయాత్ర సాగుతుందని వైయస్ షర్మిల స్పష్టం చేశారు. ప్రజల కోసమే ప్రజాప్రస్థానం పాదయాత్ర పుట్టిందని పేర్కొన్న షర్మిల తనదైన శైలిలో సీఎం కేసీఆర్ ను, బిజెపి నాయకులను టార్గెట్ చేశారు. వచ్చే ఎనికలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.