సీబీఐ డైరెక్టర్ తో షర్మిల సమావేశం: డైరెక్ట్ ఎటాక్ - బీజేపీ చేతికి అస్త్రం..!!
ఢిల్లీ కేంద్రంగా తెలుగు రాజకీయాలు కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనతో కొత్త సమీకరణలు తెర మీదకు వస్తున్నాయి. వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల ఢిల్లీ వెళ్లారు. నేరుగా సీబీఐ డైరెక్టర్ తో భేటీ అయ్యారు. తెలంగాణలో పార్టీ ఏర్పాటు తరువాత తొలి సారి ఢిల్లీ పర్యటనకు వచ్చిన షర్మిల కేంద్రంలోని పెద్దలతో సమావేశం అవుతున్నట్లుగా ప్రచారం సాగింది. ఈ సమయంలో షర్మిల నేరుగా సీబీఐ డైరెక్టర్ తో సమావేశమయ్యారు.
షర్మిల నేరుగా ఫిర్యాదు
తెలంగాణలో పార్టీ ఏర్పాటు సమయంలో తన అన్న ఏపీ సీఎం జగన్ తో విభేదించిన షర్మిల.. ఇప్పుడు తెలంగాణలో సీఎం కేసీఆర్ లక్ష్యంగా రాజకీయంగా అడుగులు వేస్తున్నారు. పాదయాత్రలోనూ టీఆర్ఎస్ మంత్రులు - కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. ఇదే సమయంలో తెలంగాణలో షర్మిల తన పాదయాత్ర 2500 కిలో మీటర్లు పూర్తి చేసారు. కొద్ది రోజుల క్రితం తెలంగాణలో ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందంటూ పలు సందర్భాల్లో షర్మిల ఆరోపణలు చేసారు. ఇతర పార్టీల నేతలు ఇదే రకమైన ఆరోపణలు చేసినా..షర్మిల నేరుగా ఇదే అవినీతి అంశం పైన నేరుగా సీబీఐ డైరెక్టర్ ను కలిసి ఫిర్యాదు చేసారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో లక్ష కోట్ల అవినీతి జరిగిందని..మెగా కంపెనీ తో కలిసి ఈ లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారని సీబీఐకు షర్మిల ఫిర్యాదు చేసారు.
జాతీయ పార్టీ ప్రకటన వేళ
దీని పైన విచారణ జరిపించాలంటూ వినతి పత్రం తో పాటుగా తన వద్ద ఉన్న సమాచారం అందించారు. గతంలో కేంద్ర మంత్రులు తెలంగాణ పర్యటన సమయంలో ఇదే ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందంటూ కేసీఆర్ ప్రభుత్వం పైన ఆరోపణలు చేసారు. ఇప్పుడు దీని పైన విచారణ డిమాండ్ చేస్తూ షర్మిల ఏకంగా సీబీఐ డైరెక్టర్ ను కలిసారు. దీంతో..ఇప్పుడు సీబీఐ ఈ వ్యవహారంలో ఏం చేయబోతుందనేది ఆసక్తి కరంగా మారుతోంది. ఇప్పటి వరకు రాజకీయ ఆరోపణలుగా కొనసాగిన ఈ అవినీతి వ్యవహారం పైన ఇప్పుడు నేరుగా ఫిర్యాదు రావటంతో సీబీఐ అడుగులు కీలకంగా మారనున్నాయి.
బీజేపీ చేతికి అస్త్రంగా
అటు బీజేపీ సైతం తెలంగాణలో ఎలాగైనా కేసీఆర్ ను ఓడించాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ - ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఇందులో టీఆర్ఎస్ నేతల ప్రమేయం ఉందంటూ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ సమయంలో షర్మిల ఫిర్యాదు ఆసక్తి కరంగా మారింది. కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన..ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా దేశ వ్యప్త పర్యటనకు సిద్దం అవుతున్న సమయంలో సరిగ్గా ఈ ఫిర్యాదు సీబీఐకు చేరింది. దీంతో, ఈ వ్యవహారం రాజకీయంగానూ చర్చకు కారణమవుతోంది.