పందికొక్కుల్లా రాష్ట్రం మీదపడి తిన్నది చాలదని దేశంమీద పడ్డారు కేసీఆర్: విరుచుకుపడిన వైఎస్ షర్మిల
వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. రాష్ట్రాన్ని నాశనం చేసిన కేసీఆర్ ఇప్పుడు దేశం మీద పడుతున్నాడని నిప్పులు చెరుగుతున్నారు. పందికొక్కుల్లా రాష్ట్రం మీద పడి దోచున్నది చాలదని సీఎం కేసీఆర్ ఇప్పుడు దేశం మీద పడ్డారని వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

కెసీఆర్ అవినీతి .. టీఆర్ఎస్ నాయకులకు అంత డబ్బెక్కడిది
వందల కోట్లు ఖర్చు పెట్టి జెట్ విమానాలు కొంటారా అంటూ మండిపడ్డ షర్మిల, టిఆర్ఎస్ పార్టీ నాయకులకు ఇంత డబ్బు ఎలా వచ్చిందో చెప్పాలని నిలదీశారు. మెదక్ జిల్లాలో ప్రస్తుతం పర్యటిస్తున్న షర్మిల కెసిఆర్ అవినీతి పై నిప్పులు చెరిగారు. కేసీఆర్ అవినీతి గురించి తెలియాలంటే కాళేశ్వరం ప్రాజెక్టు ను చూస్తే చాలు అంటూ వ్యాఖ్యలు చేశారు. ఒక కాళేశ్వరం ప్రాజెక్టు లోనే లక్ష కోట్ల రూపాయలను కెసిఆర్ మింగేశారు అని వైయస్ షర్మిల ఆరోపించారు .తెలంగాణ ఆత్మగౌరవం కేసీఆర్ ఎడమ కాలు కింద నలుగుతోందని వైయస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.
వీఆర్ఏ ల ముఖం మీద పేపర్లు విసిరేస్తారా? తల పొగరా?
రాష్ట్రంలో వీఆర్ఏలు 70 రోజులుగా కొట్లాడుతున్న పట్టించుకోవడం లేదని వైఎస్ షర్మిల విమర్శించారు. వీఆర్ఏలు వినతిపత్రం ఇవ్వడానికి వస్తే ముఖం మీద పేపర్లు విసిరేస్తావా? అధికార మదం నెత్తికెక్కిందా? తల పొగరా? అసెంబ్లీ సాక్షిగా పే స్కేల్ అమలు చేస్తామని చెప్పింది నువ్వు కాదా? అంటూ ప్రశ్నించారు. వీఆర్ఏలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదా అంటూ నిలదీశారు. కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం చేసే రోజులు దగ్గర పడ్డాయని వైయస్ షర్మిల హెచ్చరించారు.
పద్మా దేవేందర్ రెడ్డిని టార్గెట్ చేసిన షర్మిల
ఇక మెదక్ లో పద్మా దేవేందర్ రెడ్డి ని టార్గెట్ చేసిన వైయస్ షర్మిల పద్మా దేవేందర్ రెడ్డి పేరుకే ఎమ్మెల్యేనట. పెత్తనం మాత్రం ఆమె భర్తదేనట అంటూ అసహనం వ్యక్తం చేశారు. అన్ని పనుల్లో కమిషన్లు తీసుకుంటున్నారని, ఆయనకు కమీషన్లు ఇచ్చుకోలేక కాంట్రాక్టర్లే చేతులెత్తేస్తున్నారని వైయస్ షర్మిల పేర్కొన్నారు. కోనాపూర్ సొసైటీలో నిధులు స్వాహా చేసినా, ఆయనపై కేసు కూడా నమోదు చేయలేదని వైయస్ షర్మిల ఆరోపించారు. భర్తకో న్యాయం, ప్రజలకో న్యాయమా? అని వైయస్ షర్మిల ప్రశ్నించారు.
ఆరోగ్య శ్రీ విషయంలో నిప్పులు చెరిగిన వైఎస్ షర్మిల
అంతేకాదు ఆరోగ్యశ్రీ అద్భుతమని పొగిడిన కేసీఆర్.. ఆ పథకాన్ని మరుగునపడేశారని వైయస్ షర్మిల మండిపడ్డారు. ఆరోగ్యశ్రీకి నిధులు ఇవ్వకపోవడంతో, రోగులు కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లలేక, దేవుడిపై భారం వేసి, ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తుంటే, మంత్రి హరీశ్ రావు ఏదో గొప్ప పని చేసినట్టు జబ్బలు చరుచుకుంటున్నాడు అని వైయస్ షర్మిల పేర్కొన్నారు.
చెరకు రైతులను నిండా ముంచింది కేసీఆర్ కాదా
ఎన్నికల్లో ఓట్లేస్తే 100రోజుల్లో నిజాం డెక్కన్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని కెసిఆర్ రెండు సార్లు హామీ ఇచ్చి, చెరుకు రైతులను నిండా ముంచాడని మండిపడ్డారు. వైయస్సార్ తెలంగాణ పార్టీ అధికారంలోకి రాగానే డెక్కన్ షుగర్ ఫ్యాక్టరీతో పాటు రాష్ట్రంలోని అన్ని షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తానని మాటిస్తున్నానని వైయస్ షర్మిల పేర్కొన్నారు. మీరు సహకరిస్తే దొరల పాలనను తరిమికొడతా అని వైయస్ షర్మిల తన ప్రజా ప్రస్థానం పాదయాత్రలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications