కాబోయే ‘సీఎం షర్మిల’: వరంగల్ నేతల నినాదాలు -కేసీఆర్పై విమర్శలు -జయశంకర్కు నివాళి
తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు ప్రయత్నాల్లో ఉన్న వైఎస్ షర్మిల వరుసగా సమావేశాలు జరుపుతున్నారు. ఇప్పటికే నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోని నేతలు, వైఎస్సార్ అభిమానుతో చర్చలు జరిపిన ఆమె, బుధవారం ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినవారితో భేటీ అయ్యారు. తెలంగాణ సాంస్కృతిక రాజధాని వరంగల్ అని, ఆ జిల్లాతో దివంగత వైఎస్సార్ కు ప్రత్యేక అనుబంధం ఉందని షర్మిల గుర్తుచేశారు. వైఎస్సార్ బతికుంటే వరంగల్ మరోలా ఉండేదంటూ ప్రస్తుత పాలకుడు కేసీఆర్ పై విమర్శలు చేశారు. వివరాల్లోకి వెళితే..

జయశంకర్కు నివాళి..
తెలంగాణ ఉద్యమంలో మైలురాయిగా నిలిచిన 'మిలియన్ మార్చ్' ఘట్టానికి నేటి(మార్చి 10)తో 10ఏళ్లు పూర్తయిన సందర్భంగా నాటి ఘటనలను గుర్తుచేసుకుంటూ, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ కు వైఎస్ షర్మిల నివాళి అర్పించారు. అనంతరం ఉమ్మడి వరంగల్ జిల్లా వైఎస్సార్ అభిమానులతో ఆమె ఆత్మీయ సమావేశం నిర్వహించారు. హాజరైనవారి నుంచి అభిప్రాయలు, సూచనలు, సలహాలు తీసుకున్న తర్వాత షర్మిల ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు..

వరంగల్ ఇలా ఉండేది కాదు..
తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్, కవి కాళోజి లాంటి మహానుభావులు, అందెశ్రీ లాంటి రచయితలు, ఎందరో ఉద్యమకారులు, కళాకారులు, కవులు పుట్టిన ఓరుగల్లు గడ్డ.. రాష్ట్ర సాంస్కృతిక రాజధానిగా విలసిల్లుతున్నదని, వరంగల్తో వైఎస్సార్ కు ప్రత్యేక అనుబంధముందని, ఆయన ఉంటే.. నగరం ఇప్పుడున్నట్లు కాకుండా, మరింతగా అభివృద్ది చెందేదని షర్మిల పేర్కొన్నారు.

దుస్థితికి సమాధానం చెప్పాలి..
వరంగల్ను ఐటీ హబ్గా చేయాలని వైఎస్సార్ కలలుగన్నారని.. కానీ అది నెరవరలేదని షర్మిల అన్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును 80 శాతం పూర్తి చేసిన ఘనత వైఎస్సార్కే దక్కుతుందన్నారు. ప్రస్తుత పాలకులు కంతన్ పల్లి ప్రాజెక్ట్ ను పూర్తి చేయక పోవడం బాధాకరమని, కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు రాలేదో ఆలోచించాలని, వరంగల్ ఇంకా ఎందుకు స్మార్ట్ సిటీ కాలేదో రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆమె నిలదీశారు. నిజానికి..

విద్యార్థులపై దమనకాండ.
ఉద్యమంలో యాన్మంది విద్యార్థులు ముందుండి పోరాటం చేస్తేనే తెలంగాణ కల సాధ్యమైందని, అలాంటిది, విద్యార్థుల త్యాగాలపై గద్దెనెక్కిన ప్రస్తుత పాలకులు అదే విద్యార్థులపై దమనకాండకు దిగుతున్నారని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే విద్యార్థులపై దాడులు చేయడం బాధాకరమని వైఎస్ షర్మిల అన్నారు. వరంగల్ గడ్డపై కొలువైన కాకతీయ వర్సిటీకి వీసీ ఉన్నారా? అని ప్రశ్నించారు. కాగా,

కాబోయే సీఎం షర్మిల..
ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నేతలు, వైఎస్సార్ అభిమానులతో ఆత్మీయ సమావేశం సందర్భంగా లోటల్ పాండ్ లో తొలిసారిగా కొత్త రకం నినాదాలు వినిపించాయి. 'తెలంగాణకు కాబోయే సీఎం షర్మిల' అంటూ సమ్మేళనంలో అభిమానులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. రాష్ట్రంలో రాజన్న రాజ్యం తేవాలన్నదే తన లక్ష్యమని, ఆ రాజన్న బిడ్డకు వరంగల్ అభిమానులు, నేతల సలహాలు, సూచనలు అవసరమని షర్మిల పేర్కొన్నారు. ఆమె నేతృత్వంలో ఏర్పాటు కానున్న 'వైఎస్సార్ తెలంగాణ పార్టీ'ని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.












Click it and Unblock the Notifications