Huzurabad : ఆనాడు వైఎస్సార్ ఈటలకు మంత్రి పదవి ఆఫర్ చేసినా... ఈటల జమున కీలక వ్యాఖ్యలు
తెలంగాణ ఉద్యమ సమయంలో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈటల రాజేందర్కు మంత్రి పదవి ఆఫర్ చేసినా ఆయన తీసుకోలేదని ఈటల జమునా రెడ్డి పేర్కొన్నారు. కుట్రపూరితంగానే తమపై భూకబ్జా ఆరోపణలు చేశారని మండిపడ్డారు.హుజురాబాద్ ప్రజలు ఈటల వెంటే ఉన్నారని అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట మండలం మాచినపల్లిలో సోమవారం(అక్టోబర్ 11) బీజేపీ ఎన్నికల ప్రచారంలో జమునా రెడ్డి పాల్గొన్నారు.
ఉపఎన్నికపై బీజేపీ జాతీయ కార్యవర్గం సభ్యుడు వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ... హుజురాబాద్ ఉపఎన్నికలో ప్రజలు పువ్వు గుర్తుకే ఓటేస్తారని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం.. మద్యం, బిర్యానీలు,మాయ మాటలతో ఈటలను ఓడించాలని చూస్తోందన్నారు.టీఆర్ఎస్ ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా ప్రజల మనసును గెలిచిన ఈటల రాజేందర్ భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండల కేంద్రంలో వివేక్ వెంకటస్వామి మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల ప్రభుత్వమని, కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ప్రజలు గుర్తొస్తారని విమర్శించారు. ఎన్నికల సమయంలో హామీలు గుప్పించి... ఆ తర్వాత మర్చిపోవడం సీఎం కేసీఆర్కు పరిపాటిగా మారిందన్నారు.
హుజురాబాద్ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ను ఓడించేందుకే ప్రభుత్వం అనేక పథకాలు తీసుకొచ్చిందన్నారు. ఎన్నికల తర్వాత కూడా ఇక్కడే ఉండి అభివృద్ధి చేస్తామని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారని... నాగార్జున సాగర్, హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.ఇప్పటివరకూ అక్కడ ఎన్ని హామీలు నెరవేర్చారో చెప్పాలని నిలదీశారు. మాయమాటలు చెప్పి.. ఎన్నికల తర్వాత మర్చిపోవడం టీఆర్ఎస్కు అలవాటైపోయిందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో వరద బాధితులకు రూ.10వేలు చొప్పున ఆర్థిక సాయం చేస్తామని చెప్పిన ప్రభుత్వం... ఆ మాట నిలబెట్టుకోలేదన్నారు.ఎన్నికల తర్వాత.. వారికి పైసా కూడా ఇవ్వలేదు. హుజురాబాద్లో కూడా ఇలాంటి వాగ్దానాలే చేస్తున్నారని... ఇవన్నీ నెరవేరవని ఇప్పటికే ప్రజలకు అర్థమైందన్నారు. అందుకే ఈటలనే గెలిపించుకోవాలని ప్రజలు ఇప్పటికే డిసైడ్ అయ్యారని పేర్కొన్నారు.
హుజురాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ ఎలాంటి అభివృద్ధి చేయలేదని టీఆర్ఎస్ నేతలు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. ఎమ్మెల్యే బాల్క సుమన్, మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే ధర్మారెడ్డి లాంటి తమ తమ నియోజకవర్గాల్లో ఏమీ చేయకపోయినా.. ఈటలపై విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ముందు వాళ్ల నియోజకవర్గాల్లో ఏం అభివృద్ది చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఏం చేస్తోందని టీఆర్ఎస్ నాయకులు పదేపదే విమర్శలు చేస్తున్నారని... ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఆరు నెలల పాటు 80 కోట్ల మందికి ఫ్రీ రేషన్ ఎక్కడా ఇవ్వలేదని అన్నారు.కేవలం మోదీ సర్కారు మాత్రమే పేద ప్రజలను ఆదుకునేందుకు 80 కోట్ల మందికి రేషన్ బియ్యం ఇచ్చిందన్నారు. ఉజ్వల్ స్కీంలో ఉన్నవారికి ఉచిత గ్యాస్ ఇచ్చారని, ఉపాధి హామీ పథకం కింద కూలీ రేటును రూ.180 నుంచి రూ.237కు పెంచారని అన్నారు.కరోనా కష్టకాలంలో కేంద్రం ఎంతోమందికి ఉపాధి చూపించిందన్నారు. దేశంలో ఇప్పటివరకూ 95 కోట్ల మందికి ఫ్రీ వాక్సిన్ ఇచ్చారని... ఇంత త్వరగా అంతమందికి వ్యాక్సిన్ ఇవ్వడంపై ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోతున్నాయని అన్నారు.
రాష్ట్రంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. టీఆర్ఎస్ సర్కారు రాష్ట్రాన్ని తాగుబోతుల రాష్ట్రంగా మార్చడం బాధ కలిగిస్తోందన్నారు. ఓవైపు ధనిక రాష్ట్రమని చెబుతూనే... మరోవైపు ప్రజలపై అప్పుల భారం మోపారని అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల్లో కమీషన్లు తీసుకున్నారని ఈటల చేస్తున్న ఆరోపణలు నిజమేనన్నారు.