వీడిన మిస్టరీ: వైసీపీ మహిళా నేత హత్య కేసులో నిందితులు వీరే
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా నాయకురాలు వరలక్ష్మి (36) హత్య కేసును పోలీసులు ఛేదించారు. వరలక్ష్మిది కిరాయి హత్యగా తేల్చిన పోలీసులు.. సన్నిహితులే నమ్మించి గొంతుకు ఉరి బిగించి హతమార్చారని పోలీసుల విచారణలో వెల్లడైంది.
ఇద్దరు మహిళల మధ్య నెలకొన్న పాత కక్షలు, వివాదాలు, కేసులే హత్యకు దారితీశాయి. వరలక్ష్మిని హత్య చేసిన నిందితులు నారాయణదాస్, భీంభరత్, ముక్కు రవికుమార్ అలియాస్ శ్యామ్లను పోలీసులు అరెస్టు చే సి కోర్టులోహాజరు పరిచారు. ఆదివారం రాత్రి స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నిందితులను ప్రవేశపెట్టారు.
రాష్ట్ర వ్యాప్తంగా సంచనలం సృష్టించిన వరలక్ష్మి హత్యోదంతానికి దారితీసిన వివరాలను సీఐ రవి, ఎస్ఐ రవీందర్లతో కలిసి డీఎస్పీ టి.స్వామి వెల్లడించారు. తాండూరుకు చెందిన ముద్దంగుల వరలక్ష్మి (36)కి అదే పట్టణానికి చెందిన జనార్ధన్రెడ్డి, విజయలక్ష్మి పండిత్లతో ఐదు సంవత్సరాలుగా గొడవలు ఉన్నాయి.

ఈ క్రమంలో ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకున్నారు. దీంతో వరలక్ష్మిని హత్య చేయాలనుకున్న జనార్ధన్రెడ్డి, విజయలక్ష్మి పండిత్లు టఫ్ జిల్లా కార్యదర్శి నారాయణదాస్(చేవెళ్ల), టఫ్ రాష్ట్ర కార్యదర్శి పామెన భీంభరత్ (నారెడ్లగూడ, షాబాద్ మండలం), ముక్కు రవికుమా ర్ అలియాస్ శ్యామ్ (నారెడ్లగూడ, షాబాద్ మం డలం)లను ఆశ్రయించారు.
వరలక్ష్మిని హత్య చేస్తే రూ.3 లక్షలిస్తామని ఆరు నెలల క్రితం ఒప్పందం కుదుర్చుకున్నారు. అడ్వాన్సుగా రూ. లక్ష ఇచ్చి మిగతాది పని పూర్తయ్యాక ఇస్తామని మాట్లాడుకున్నారు. మరోవైపు, వరలక్ష్మి తన సమస్యల నుంచి బయటపడేందుకు విమలక్కను కలవాలనుకుంది. దాని కోసం నారాయణదాస్, భీంభరత్ల సాయం కోరింది.
కాగా, వరలక్ష్మిపై రౌడీషీట్ తెరిచారనే విషయం తెలుసుకున్న విమలక్క తనను కలిసేందుకు అవకాశం ఇవ్వలేదు. ఇదిలా ఉంటే, గత నెల 31న హైదరాబాద్ వెళ్లడానికి మధ్యాహ్నం 12 గంటలకు ఇంట్లో నుంచి బయల్దేరిన వరలక్ష్మి 12.30కు హైదరాబాద్ బస్సు ఎక్కారు. సమయం కోసం వేచి చూస్తున్న నారాయణదాస్, భీంభరత్లు ఆమెతో ఫోన్లో మాట్లాడారు.
హైదరాబాద్కు వచ్చినా పని కాలేదని, తిరిగి తాండూరు వెళుతున్నానని సమాధానం చెప్పిన వరలక్ష్మిని మొయినాబాద్లో దిగాలని, తాము తాండూరులో దిగబెడతామని చెప్పా రు. దీంతో వారిని కలిసి తన సమస్యను పరిష్కరించుకోవచ్చని ఆమె మొయినాబాద్లో దిగింది.
అప్పటికే చేవెళ్ల నుంచి ఇన్నోవాలో మొయినాబాద్కు వచ్చిన నారాయణదాస్, భీంభరత్, ముక్కు రవికుమార్ ఆమెను తమ వాహనంలో ఎక్కించుకుని తిరిగి ఆరె మైసమ్మ వైపు వచ్చారు. అక్కడ ఓ మద్యం దుకాణంలో రెండు మద్యం సీసాలు తీసుకుని వికారాబాద్ వైపు బయల్దేరారు. మద్యం సీసాలో రవికుమార్ మత్తు మందు కలిపాడు.
ఇది తాగిన వరలక్ష్మి మత్తులోకి వెళ్లిపోయింది. చేవెళ్లలోని ఓ హార్డ్వేర్ దుకాణంలో నైలాన్ తాడు కొనుగోలు చేశారు. మార్గమధ్యలో వరలక్ష్మికి ఆమె చెల్లెలు ఫోన్ చేస్తే, తాను విమలక్క కారులో ఉన్నానని, దాంట్లోనే తాండూరుకు వస్తానని చెప్పింది. మృతురాలి సోదరి పోలీసులకు ఇదే విషయం చెప్పింది.

వికారాబాద్ మీదుగా కెరెళ్లి వద్దకు చేరుకున్న నిందితులు తాండూరు వైపు వెళ్లకుండా బుగ్గ మీదుగా వికారాబాద్ వైపు వచ్చే రోడ్డులో తిరుగు ప్రయాణమయ్యారు. ఈ విషయాన్ని మద్యం మత్తులో ఉన్న వరలక్ష్మి కనిపెట్టలేక పోయింది. కెరెల్లి దాటిన తరువాత సీట్లో కూర్చొని ఉన్న వరలక్ష్మి మెడకు నైలాన్ తాడుతో ఉరివేసి హతమార్చారు.
ఉరివేసిన తాడుతోనే వరలక్ష్మి మృతదేహాన్ని వాహనంలో నుంచి బయటకు లాగేసి, అనంతగిరిపల్లి శివారులోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల దగ్గరలో రోడ్డు పక్కన పడేసి పారిపోయారు. వరలక్ష్మి కాలి చెప్పులను రైల్వే ట్రాక్పైన పడేసిన నిందితులు ఆమె సెల్ఫోన్ను హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ బండల లారీలో పడేశారు.
దీంతో ఈ కేసు పోలీసులకు సవాల్గా మారింది. ఎలాగైనా సరే వరలక్ష్మీ హత్య కేసుని 24 గంటల్లో ఛేదిస్తామని చెప్పిన పోలీసులు అలాగే ఈ కేసుని చేధించారు. సంఘటన స్థలంలో లభ్యమైన ఆధారాలు, పోస్ట్మార్టం నివేదిక, వరలక్ష్మి సెల్ఫోన్ కాల్ డేటా ఆధారంగా కూపీ లాగారు.
ఈ సంఘటనను ఛాలెంజ్గా తీసుకున్న జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. ఆదివారం ఉదయం పోలీసులు చేవెళ్లలో కడమంచి నారాయణదాస్ను అదుపులోకి తీసుకుని విచారించగా భీంభరత్, ముక్కు రవికుమార్లతో కలిసి వరలక్ష్మిని హతమార్చామని నేరం అంగీకరించినట్లు డీఎస్పీ స్వామి తెలిపారు.
నారాయణదాస్ ఇచ్చిన సమాచారంతో భీంభరత్, రవికుమార్లను అదుపులోకి తీసుకుని విచారించగా వరలక్ష్మిని తామే హత్య చేసినట్లు ఒప్పుకున్నారని డీఎస్పీ చెప్పారు. వరలక్ష్మిని హత్య చేసేందుకు ప్రేరేపించిన జనార్ధన్రెడ్డి, విజయలక్ష్మి పండిత్ పరారీలో ఉన్నారని, వారిని త్వరలో పట్టుకుంటామని ఆయన తెలిపారు.
హత్యకు ఉపయోగించిన ఇన్నోవా (ఏపీ28 బీజే 2007), మోటార్ సైకిల్ (ఏపీ 28 డీటీ 1040), మూడు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను కోర్టులో హాజరు పరిచి రిమాండ్కు తరలించారు. ఇదిలాఉంటే, వరలక్ష్మి హత్యతో టఫ్ అధ్యక్షురాలు విమలక్కకు సంబంధమున్నట్లు ఆధారాలేమీ లభించలేదని డీఎస్పీ స్వామి స్పష్టం చేశారు.
ఈ ఘటనకు సంబంధించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ప్రభు, విమలక్కల పాత్రపైన లోతుగా విచారణ చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ హత్యకేసుకు సంబంధించిన వారు ఎంతటి వారైనా విడిచిపెట్టేది లేదని ఆయన స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications