రాజ్యాంగ నిర్మాతకు షర్మిల నివాళి: విరామానికి పుల్స్టాప్: పుట్టినరోజు నాడే పాదయాత్ర
హైదరాబాద్: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల కొంత విరామం తరువాత పార్టీ కార్యకలాపాలపై దృష్టి సారించారు. హైదరాబాద్ లోటస్పాండ్లోని తన నివాసంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయంలో అడుగు పెట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో- తన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రను తాత్కాలికంగా నిలిపివేసిన అనంతరం ఆమె పార్టీ కార్యాలయానికి రావడం ఇదే తొలిసారి. ఈ నెల 17వ తేదీ నుంచి పాదయాత్ర పునఃప్రారంభం కానున్నందున, దీనికి సంబంధించిన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.
రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మహా పరినిర్వాణ్ దివస్ను పురస్కరించుకుని వైఎస్ షర్మిల ఆయనకు ఘనంగా నివాళి అర్పించారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. దళిత జనోద్ధారకుడిగా చరిత్రలో అంబేద్కర్ చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. ఆయనను రాజ్యాంగ రూపశిల్పిగా అభివర్ణించారు.
వెనుకబడిన వర్గాలు, దళితులు, బలహీన వర్గాలకు కొన్ని సదుపాయాలను కల్పించకపోతే వారు ఎప్పుడూ అభివృద్ధి సాధించలేరని బీఆర్ అంబేద్కర్ బలంగా విశ్వసించారని వైఎస్ షర్మిల అన్నారు. వారికోసం రిజర్వేషన్ల వ్యవస్థను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను కల్పించకపోయి ఉంటే ఆయా వర్గాలు అభివృద్ది చెందవని అంబేద్కర్ ఆనాడే గుర్తించారని చెప్పారు. ఆయన దూరదృష్టి వల్లే వెనుకబడిన వర్గాలు, దళిత, బలహీన వర్గాలు అభ్యున్నతిని సాధిస్తున్నాయని అన్నారు.

రాజకీయాల్లోనూ ఆయా వర్గాలకు ప్రాతినిథ్యాన్ని కల్పించడానికి అంబేదర్క్ ఎన్నో చర్యలు తీసుకున్నారని వైఎస్ షర్మిల చెప్పారు. రాజకీయాలు, చట్టసభలో దళితులు, బడుగు, బలహీన, అణగారిన వర్గాల ప్రాతినిథ్యం ఉండాలని తపించారని అన్నారు. ఆ మహామనిషిని స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీదా ఉందని పేర్కొన్నారు. పౌరులందరికీ సమాన హక్కులు, సామాజిక న్యాయం వర్తించేలా అత్యుత్తమ రాజ్యాంగాన్ని రచించారని నివాళి అర్పించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం చివరి శ్వాస వరకు పోరాడిన మహనీయుడని అన్నారు.
కాగా- వైఎస్ షర్మిల పాదయాత్ర ఈ నెల 17వ తేదీన పునఃప్రారంభం కానుంది. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వల్ల దీనికి తాత్కాలికంగా బ్రేక్ పడిన విషయం తెలిసిందే. అదే రోజు వైఎస్ షర్మిల పుట్టినరోజు. ఈ దఫా పుట్టినరోజును ప్రజల మధ్య జరుపుకోనున్నారు. పుట్టినరోజు నాడే పాదయాత్రను పునఃప్రారంభించాలని నిర్ణయించుకోవడానికి ఇదీ ఓ కారణంగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర పూర్తియింది.












Click it and Unblock the Notifications