పోడు యాత్రకు సిద్ధమవుతున్న వైఎస్ షర్మిల... ఈ నెల 22న ములుగు జిల్లాలో...
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈనెల 22న ములుగు జిల్లాలో పర్యటించనున్నారు.గిరిజనుల పోడు సమస్య పరిష్కారానికి జిల్లా నుంచి పోడు యాత్రకు ఆమె శ్రీకారం చుట్టనున్నారు. ములుగు జిల్లాతో పాటు రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ పోడు భూములకు పట్టాలివ్వాలన్న డిమాండుతో షర్మిల పోడు యాత్ర చేపట్టనున్నారు. వైఎస్సార్టీపీ ములుగు జిల్లా అధ్యక్షుడు రామసహాయం శ్రీనివాసరెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు.
ములుగు జిల్లా పర్యటనలో భాగంగా మొదట షర్మిల జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళి అర్పిస్తారు.అక్కడి నుంచి గోవిందరావుపేట మండలం పస్రా పసరాకు చేరుకొని కొమురంభీం విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తారు. అనంతరం తాడ్వాయి మండలం లింగాల గ్రామంలో పోడు యాత్రలో పాల్గొని అక్కడి రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటారు. ఈ సందర్భంగా స్థానిక రైతుల పోడు భూములను స్వయంగా పరిశీలించనున్నారు.
ఇప్పటికే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యపై ప్రతీ మంగళవారం వైఎస్ షర్మిల నిరుద్యోగ దీక్ష చేపడుతున్న సంగతి తెలిసిందే. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలం గంగాదేవిపాడు గ్రామంలో మంగళవారం(జులై 20) షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీలన్నీ వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
పోడు సమస్య విషయానికి వస్తే... రాష్ట్రంలో ఇది రోజురోజుకు తీవ్రమవుతోంది. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలోనే పోడు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పినప్పటికీ.. ఇప్పటికీ ఆ మాటలు ఆచరణకు నోచుకోలేదు. దీంతో గిరిజనులు,అటవీ అధికారులకు మధ్య నిత్యం ఘర్షణలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. గత కొద్దిరోజులుగా వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. పోడు భూముల స్వాధీనానికి అధికారులు యత్నించడం... ప్రజలు తిరగబడటం జరుగుతోంది.
ఇదే పోడు అంశానికి సంబంధించి కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క మంగళవారం(జులై 20) తీవ్ర స్థాయిలో స్పందించారు. మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ డిప్యూటీ రేంజ్ అధికారి శ్రీనివాస్ రెడ్డిపై కన్నెర్ర చేశారు.మహిళా రైతుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే తరిమికొడుతారు జాగ్రత్త... రైతులకు అన్యాయమా.. కత్తులు,గొడ్డళ్లతో దాడులు చేస్తారు ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు.మహబూబాబాద్ జిల్లా గంగారం, కొత్తగూడ, గూడురు మండలాల్లో సీతక్క పోడు భరోసా యాత్ర నిర్వహించారు. ఇప్పుడు షర్మిల కూడా ఇదే బాటలో పోడు యాత్రకు సిద్ధమవుతున్నారు.