తెలంగాణలో 104 సర్వీసులు బంద్?: పల్లె దవాఖానాలు అందుకే: వైఎస్ షర్మిల ఆరోపణల వెనుక
హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలను అందించడానికి ఏర్పాటు చేసిన 104 సర్వీసులు కనుమరుగు కానున్నాయా? వాటికి బదులుగా పల్లె దవాఖానాలను కేసీఆర్ సర్కార్ తెర మీదికి తీసుకొచ్చిందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనికి కారణం- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల చేస్తోన్న ఆరోపణలు. పల్లె దవాఖానాల పేరుతో 104 సర్వీసులను తొలగించడానికి కేసీఆర్ సర్కార్ ప్రయత్నాలు సాగిస్తోందంటూ ఆమె చేసిన ఆరోపణలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
తెలంగాణలో ప్రభుత్వం బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అది విజయవంతమైందని, అదే స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో పల్లె దవాఖానాలను అందుబాటులోకి తీసుకొస్తామని కేసీఆర్ సర్కార్ ఇదివరకే ప్రకటించింది. తొలిదశలో రాష్ట్రవ్యాప్తంగా త్వరలో నాలుగు వేల పల్లె దవాఖానాలను అందుబాటులోకి తేవడానికి కసరత్తు చేస్తోంది. ఆర్థికం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టీ హరీష్ రావు ఈ విషయాన్ని స్పష్టం చేశారు కూడా.

దీనిపై వివాదాలు తలెత్తుతున్నాయి. వైఎస్ షర్మిల పలు అనుమానాలను లేవనెత్తారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన 104 సర్వీసులను తొలగించడానికి కేసీఆర్ సర్కార్ కుట్ర పన్నిందని ఆరోపించారు. గ్రామీణ ప్రజలకు ప్రభుత్వ వైద్యాన్ని దూరం చేసే ప్రయత్నాలు చేస్తోందంటూ మండిపడ్డారు. బస్తీ దవాఖానాలకు సుస్తీ చేసిందని గుర్తు చేశారు. బస్తీ దవాఖానాల వ్యవస్థ విఫలమైందని, దాన్ని గ్రామాలకు కూడా విస్తరింపజేస్తామనడంలో అర్థం లేదని వైఎస్ షర్మిల విమర్శించారు.
గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించాలనే లక్ష్యంతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన హయాంలో 104 సేవలను ప్రవేశపెట్టారని, పేదల ఇళ్ల ముంగిటకే వైద్య సౌకర్యాలను ఆయన కల్పించారని అన్నారు. ఇప్పుడు కేసీఆర్ సర్కార్ పల్లె దవాఖానాల పేరిట 104 సేవలను బంద్ పెట్టాలని చూస్తోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంటి వెలుగు కంటికి కనపడకుండా పోయిందని, బస్తీ దవాఖానాలకు సుస్తీ చేసిందని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో 104 సర్వీసులను కూడా రద్దు చేసే సాహసానికి ప్రభుత్వం పూనుకుంటోందని విమర్శించారు.
సర్కార్ దవాఖానలో సౌలతులు కరవయ్యాయని వైఎస్ షర్మిల అన్నారు. పల్లె దవాఖానాలను ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియదని, దాని కంటే ముందే 104 సర్వీసులను బంద్ చేస్తోందని చెప్పారు. పల్లె దవాఖానాలను ప్రారంభించకుండానే 104 సర్వీసులను బంద్ చేస్తున్నారంటే- ప్రభుత్వానికి ప్రజల ప్రాణాల మీదున్న ప్రేమ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చని అన్నారు. సౌలతులు లేక, వైద్యం అందక సర్కార్ దవాఖానల్లో జనం కరోనాతో మరణిస్తున్నారని గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications