వీడియో: మాట్లాడ్డానికి రాలేదు.. వినడానికే వచ్చా: ఆత్మీయ సమావేశంలో వైఎస్ షర్మిల భావోద్వేగం
హైదరాబాద్: ఊహించినట్లే- దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె., ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిల.. పూర్తిస్థాయి రాజకీయాల్లో ప్రవేశించారు. త్వరలోనే కొత్త పార్టీని పెట్టబోతోన్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (YSRTP) పేరుతో కొత్త రాజకీయ పక్షాన్ని ప్రారంభించనున్నారు. వచ్చేనెల పార్టీ పేరును అధికారికంగా ప్రకటించబోతోన్నారు. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ అప్పుడే ఆరంభం కానుంది. కొద్దిసేపటి కిందటే ఆమె హైదరాబాద్ లోటస్పాండ్లోని నివాసంలో వైఎస్సార్ అభిమానులు, వైసీపీ సానుభూతిపరులతో సమావేశం అయ్యారు.
Video: ఆత్మీయ సమావేశంలో వైఎస్ షర్మిల భావోద్వేగం #YSSharmila pic.twitter.com/YaQ9ym6cnq
— oneindiatelugu (@oneindiatelugu) February 9, 2021
వైఎస్ రాజశేఖర్ రెడ్డి కన్నుమూసి ఇన్ని సంవత్సరాలైైనప్పటికీ.. ఆయనపై ఉన్న అభిమానం చెక్కు చెదరలేదని అన్నారు. రాజన్న బిడ్డగా తాను పిలుపునివ్వగానే తన కోసం ఇంత దూరం వచ్చారని ఆమె పార్టీ సానుభూతిపరులను ఉద్దేశించి చెప్పారు. రాజశేఖర్ రెడ్డి అందించిన బంగారు పరిపాలన గురించి తాను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. తన కంటే ఆయన అభిమానులకే బాగా తెలుసునని వ్యాఖ్యానించారు. రాజశేఖర్ రెడ్డి పాలనలో ప్రతి రైతు ఒక రాజులా జీవించారని, ప్రతి పేదవాడికి పక్కా ఇళ్లు ఉండాలని ఆయన కలలు గన్నారని గుర్తు చేశారు.
పేద కుటుంబంలో జన్మించిన పిల్లలు ఉన్నత విద్యను చదువుకోవాలని, అత్యున్నత స్థితికి చేరుకోవాలని అకాంక్షించారని షర్మిల చెప్పారు. పేదరికం అనేది ఒక శాపమని,, వారికి అనారోగ్యం అంటూ వస్తే.. కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటూ అప్పులపాలవుతారనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ పథకానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. ఇలాంటి అనేక కార్యక్రమాలు, పథకాలను వైఎస్సార్ ప్రవేశపెట్టారని చెప్పారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు తెలంగాణలో లేవని అన్నారు.
అందుకే- తెలంగాణలో రాజన్న రాజ్యం రావాలని తాను కోరుకుంటున్నానని షర్మిల చెప్పారు. రాజన్న రాజ్యం..మనతోనే సాధ్యమని తాను నమ్ముతున్నానని, ఇందులో భాగంగానే తాను ఈ ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశానని వివరించారు. వైఎస్సార్ అభిమానులకు తెలిసినంత బాగా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందనేది తనకు తెలియదని, వాటిని తెలుసుకోవడానికే తాను వచ్చానని అన్నారు. గ్రామస్థాయిలో నెలకొన్న పరిస్థితులు, వాటిని మార్చడానికి చేయాల్సిన సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆమె విజ్ఞప్తి చేశారు. తాను మాట్లాడటానికి రాలేదని, వినడానికే వచ్చానని చెప్పారు.