వైఎస్ షర్మిలతో జగన్ కోటరీ ఎమ్మెల్యే భేటీ: అన్న మాటగా..!
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె., ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిల.. పూర్తిస్థాయి రాజకీయాల్లో ప్రవేశించారు. త్వరలోనే కొత్త పార్టీని పెట్టబోతోన్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (YSRTP) పేరుతో కొత్త రాజకీయ పక్షాన్ని ప్రారంభించనున్నారు. వచ్చేనెల పార్టీ పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ అప్పుడే ఆరంభం కానుంది.
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హీట్: షెడ్యూల్ ఇదే: బలం పెంచుకునే ఛాన్స్?
ఈ పరిణామాల మధ్య ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడు ఆళ్ల రామకృష్ణా రెడ్డి.. షర్మిలను కలిశారు. బంజారాహిల్స్ లోటస్ పాండ్ నివాసంలో షర్మిలతో భేటీ అయ్యారు. గంటకు పైగా వారిద్దరు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కొన్ని కీలకాంశాలు ప్రస్తావనకు వచ్చాయని సమాచారం. ఆళ్ల రామకృష్ణా రెడ్డి.. వైఎస్ జగన్ దూతగా షర్మిలను కలిశారనే వాదనలు వినిపిస్తున్నాయి. మర్యాదపూరకంగా మాత్రమే కలిశారని అంటున్నారు. కొత్తగా రాజకీయ పార్టీని పెట్టబోతోన్నందున వ్యక్తిగతంగా కలుకుని శుభాకాంక్షలు తెలపడానికే ఎమ్మెల్యే ఆర్కే.. షర్మిలతో భేటీ అయ్యారనే అభిప్రాయాలూ ఉన్నాయి.
ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. షర్మిల కొత్తగా ప్రారంభించబోయే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని, అది ఆమె వ్యక్తిగత నిర్ణయం అంటూ జగన్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రకటించారు. పార్టీని ఏర్పాటు చేయాలనే విషయంలో అన్న చెల్లెలి మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయని కుండబద్దలు కొట్టారు. అయినప్పటికీ.. షర్మిలకు అవసరమైన అండదండలను అందించడానికి వైఎస్ జగన్ సన్నద్ధంగా ఉన్నారనే అంటున్నారు.
ఇందులో భాగంగానే- ఆళ్ల రామకృష్ణా రెడ్డిని షర్మిల వద్దకు దూతగా పంపించి ఉండొచ్చని చెబుతున్నారు. ఆర్కే, షర్మిల మధ్య ఎలాంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయనేది తెలియరాలేదు. భవిష్యత్లో ఎలాంటి అవసరం ఉన్నా.. తాను ఉన్నాననే విషయాన్ని మర్చిపోవద్దని గుర్తు చేయడానికే జగన్ ఆళ్లను షర్మిల వద్దకు పంపించారని తెలుస్తోంది. కాగా- కొత్త పార్టీ ఏర్పాటు ప్రక్రియను షర్మిల మరింత ముమ్మరం చేశారు. ఆత్మీయ సమావేశాలను విస్తృతం చేయనున్నారు. ఈ నెల 20వ తేదీన ఉమ్మడి ఖమ్మం జిల్లా అభిమానులతో ఆమె భేటీ కానున్నారు.