yuvraj singh: నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో అందుబాటులోకి 120 ఐసీయూ బెడ్స్
హైదరాబాద్: టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. యువరాజ్ తన యూవీకెన్ ఫౌండేషన్ ద్వారా నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన 120 ఐసీయూ బెడ్లను అందుబాటులోకి వచ్చాయి. ఐసీయూ పడకలను వర్చువల్ విధానం ద్వారా యువరాజ్ సింగ్ బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా యువరాజ్ సింగ్ మాట్లాడుతూ.. యూవీకెన్ ఫౌండేషన్ ద్వారా దేశ వ్యాప్తంగా రూ. 2.5 కోట్లతో ఐసీయూ పడకల ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. కరోనావైరస్పై పోరుకు యూవీకెన్ ఫౌండేషన్ తరపున సహకారం అందిస్తున్నామని చెప్పారు.
మెడికల్ కాలేజీల్లో వెయ్యి పడకల ఏర్పాట్లు యూవీకెన్ లక్ష్యమన్నారు. ఇందులో భాగంగానే మొదటగా నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఐసీయూ పడకలు ఏర్పాటు చేశామని యువరాజ్ సింగ్ తెలిపారు. నిజామాబాద్ ఆస్పత్రిలో యూవీకెన్ వార్డులను జిల్లా కలెక్టర్ ఆదినారాయణ రెడ్డి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో వర్చువల్ విధానంలో పాల్గొన్న తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ.. యువరాజ్ సేవలను కొనియాడారు. కాగా, యువరాజ్ సింగ్ తన యూవీకెన్ ఫౌండేషన్ ద్వారా దేశ వ్యాప్తంగా సేవలందిస్తున్నారు. ఈ ఏడాది మే నెలలో తన ఫౌండేషన్ ద్వారా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్లో మూడున్నర కోట్ల రూపాయల ఖర్చుతో 100 పడకల ఆస్పత్రిని నిర్మించి ఇచ్చారు. 2011 ప్రపంచ కప్ టోర్నీ టీమిండియా గెల్చుకోవడంలో యువరాజ్ సింగ్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.