తిరుమల రెండో ఘాట్ రోడ్డు వద్ద కొండను ఢీకొన్న ఆర్టీసీ బస్సు...తప్పిన పెను ముప్పు!
తిరుమల:వివిధ రాష్ట్రాల్లో వరుసగా బస్సు ప్రమాదాలు నమోదవుతున్న నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ లో ఒక ఆర్టీసీ బస్సుకు పెనుముప్పు తప్పింది. ఆదివారం ఉదయాన్నే తిరుమల ఘాట్ రోడ్ పై ప్రయాణిస్తున్న ఒక ఆర్టీసీ బస్సు వేగంగా కొండను ఢీ కొంది.
అయితే కొండను ఢీ కొన్న బస్సు అక్కడే ఆగిపోవడంతో ప్రయాణికులకు స్వల్పగాయాలు మినహా మరే ప్రమాదం వాటిల్లలేదు. డ్రైవర్ మితిమీరిన వేగంతో నడపడంతో ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ప్రత్యక్ష సాక్షులతో పాటు బస్సులోని ప్రయాణికులు ఇదే చెబుతుండటం గమనార్హం.
తిరుమల కొండపైన మొదటి ఘాట్ రోడ్డు...రెండవ ఘాట్ రోడ్డుకు అనుసంధానంగా ఉన్న లింక్ రోడ్డు ఈ ప్రమాదం చోటుచేసుకోవడం గమనార్హం. బస్సుని వేగంగా నడుపుతూ ఆ రోడ్డుపై ఉన్న ఒక మలుపు వద్ద కూడా డ్రైవర్ అదే వేగంతో తిప్పడంతో బస్సు అదుపుతప్పి కొండను ఢీకొన్నట్లుగా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ బస్సులో ప్రయాణిస్తున్న వారిలో ఎక్కువమంది టిటిడి ఉద్యోగులు ఉండగా పలువురు సాధారణ భక్తులు కూడా ఉన్నారు.
ఈ ప్రమాదంలో సుమారు 15 మందికి గాయాలైనట్లు తెలిసింది. ప్రమాద సంఘటన గురించి సమాచారం తెలిసిన వెంటనే ఘటనా స్థలం వద్దకు చేరుకున్న టిటిడి సిబ్బంది క్షతగాత్రులను తిరుమలలోని అశ్విని ఆస్పత్రికి తరలించారు. అక్కడ వీరిందరికి చికిత్స నిర్వహిస్తుండగా ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపినట్లు సమాచారం.
కర్ణాటకలో ఒక కాలువలో ప్రైవేటు బస్సు పడిపోయిన ఘటనలో 30 మంది జలసమాధి అయిన సంగతి తెలిసిందే. నాలుగు రోజుల క్రితం ఒరిస్సాలో ఒక బస్సు నదిలో పడిన ఘటనలో 12 మంది చనిపోగా 50 మంది గాయపడిన విషయం విదితమే. ఇలా వరుసగా బస్సు ప్రమాదాలు నమోదవుతుండటం సాధారణ ప్రజానీకంలో చర్చనీయాంశంగా మారింది.