నాడు చిరుతలు- నేడు పాములు: అలిపిరి మెట్ల మార్గంలో శ్రీవారి భక్తుడికి పాము కాటు
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం నాడు 84,173 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 32,519 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.25 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 31 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి 14 నుంచి 16 గంటల సమయం పట్టింది. కంపార్ట్మెంట్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది అన్నప్రసాదాలు, పాలు, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.

కాగా- అలిపిరి మెట్ల మార్గంలో తరచూ పాములు సంచరిస్తోండటం కలకలం రేపుతోంది. తాజాగ ఓ భక్తుడు పాము కాటుకు గురయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని టీటీడీ అధికారులు వెల్లడించారు. పాముల సంచారాన్ని అరికట్టడానికి చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.
శుక్రవారం రాత్రి అలిపిరి మెట్ల మార్గం ఏడో నంబర్ మైలు రాయి వద్ద ఈ ఘటన సంభవించింది. బాపట్ల జిల్లా చీరాలకు చెందిన నాగేంద్ర అనే భక్తుడు కాలి నడకన తిరుమలకు బయలుదేరి వెళ్లారు. అలిపిరి మెట్ల మార్గం ఏడో మైలు రాయి వద్ద ఆయన పాము కాటుకు గురయ్యారు. కుడి కాలికి పాము కాటు వేసింది.
ఈ సమాచారం అందుకున్న వెంటనే టీటీడీ అటవీ విభాగం అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ భక్తుడిని తొలుత అశ్వినీ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం శ్రీ వేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెన్కు తీసుకెళ్లారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని అధికారులు చెప్పారు.
గతంలో అలిపిరి, శ్రీవారి మెట్టు గుండా కాలినడకన తిరుమలకు వెళ్లే శ్రీవారి భక్తులు చిరుతల సంచారం బెంబేలెత్తిన విషయం తెలిసిందే. ఓ బాలికపై చిరుత దాడి చేసింది అప్పట్లో. దీని తరువాత టీటీడీ అధికారులు తక్షణమే స్పందించారు. ఇప్పుడు పాములు కలకలం రేపుతోండటం వల్ల భక్తులు భయాందోళనలకు గురవుతున్నారు.












Click it and Unblock the Notifications