శ్రీవారి భక్తులకు అలర్ట్.. జూన్ 21న ఆ సేవలు రద్దు..
తిరుమల వెళ్లే భక్తులకు ఓ ముఖ్య గమనిక. తిరుమల ఆలయంలో ఈ నెల 21 న పలు సేవలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ పేర్కొంది. శ్రీవారి ఆలయంలో బుధవారం నాడు జ్యేష్ఠాభిషేకం ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం మూడురోజులపాటు జ్యేష్టా నక్షత్రం ముగిసే సమయంలో తిరుమల శ్రీవారికి జ్యేష్ఠాభిషేకం నిర్వహించడం ఆనవాయితీ. అదే పద్ధతిని ఏన్నో యేళ్ల నుంచి కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయంలోని సంపంగి ప్రదక్షిణంలో ఉన్న కల్యాణ మండపంలో ఉదయం, సాయంత్రం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. జ్యేష్ఠాభిషేకం కారణంగా జూన్ 21న ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఈ మూడు రోజులపాటు ఎంతో భక్తిశ్రద్ధలతో స్వామివారికి జ్యేష్టాభిషేకం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని 1990వ సంవత్సరం నుంచి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలోని సంపంగి ప్రదక్షిణంలో ఉన్న కల్యాణమండపంలో ఉదయం, సాయంత్రం ప్రత్యేక కార్యక్రమాలు జరుపుతారు.

జ్యేష్ఠాభిషేకం కారణంగా శ్రీవారి ఆలయంలో జూన్ 21వ తేదీ కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. కావున, భక్తులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా అధికారులు కోరారు. ఈ జ్వేష్టాభిషేకం కార్యక్రమంలో భాగంగా ఉదయం ఋత్వికులు శాంతిహోమం ఏర్పాటు చేశారు. శతకలశ ప్రతిష్ఠ ఆవాహన, నవకలశ ప్రతిష్ఠ ఆవాహన, కంకణ ప్రతిష్ఠ అనంతరం స్వామి, అమ్మవార్లకు అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం చేసి కంకణధారణ చేశారు. అనంతరం శ్రీమలయప్పస్వామివారికి వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో వేదపండితులు శ్రీసూక్తం, భూసూక్తం, పురుష సూక్తం, నీలా సూక్తం, నారాయణసూక్తాలను పఠిస్తుండగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేక కార్యక్రమం చేపట్టారు.












Click it and Unblock the Notifications