Tirumala: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు శనివారమే అంకురార్పణ..
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాలకు అంత సిద్ధమైంది. శనివారం అంకురార్పణతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు మొదలు కానున్నాయి. బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. దసరా సెలవులు ఉండడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు వస్తారని టీటీడీ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలోనే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
భక్తులకు ఇబ్బంది కలగకుండా అక్టోబర్ 14 నుంచి 23 తేదీ వరకు శ్రీవారి అష్టదళపద్మారాధన, తిరుప్పావడ, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. అలాగే వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు, ప్రత్యేక దర్శనాలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. బ్రహ్మత్సవాలు 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు నిర్వహించనున్నారు. అంకురార్పణలో భాగంగా వెంకటేశ్వరుడి సేనాధిపతి అయిన శ్రీవిష్వక్సేనులవారిని ఆలయ మాడ వీధుల్లో ఊరేగిస్తారు.

శ్రీవారికి అక్టోబరు 19వ తేదీన గరుడ వాహనం, 20వ తేదీన పుష్పకవిమానం, అక్టోబరు 22వ తేదీన స్వర్ణరథం, 23వ తేదీన చక్రస్నానం జరుగనున్నాయి. ఉదయం వాహనసేవ 8 గంటల నుండి 10 గంటల వరకు, రాత్రి వాహనసేవ 7 గంటల నుండి 9 గంటల వరకు నిర్వహిస్తారు. గరుడవాహనసేవ రాత్రి 7 గంటల నుంచి 12 గంటల వరకు జరగనుంది. ఆదివారం బంగారు తిరుచ్చి ఉత్సవం ఉదయం 9 గంటలకు ప్రారంభం కానుంది.
బ్రహ్మోత్సవాల్లో తొలిరోజు ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు బంగారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగిస్తారు. అదే రోజు రాత్రి శ్రీవారిని పెద్దశేషవాహన సేవ ఉంటుంది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 2వ రోజు ఉదయం శ్రీ మలయప్పస్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై భక్తులకు దర్శనమిస్తాడు. రాత్రి శ్రీమలయప్పస్వామివారు వీణాపాణియై హంసవాహనంపై సరస్వతిమూర్తి అవతారంలో దర్శనమిస్తారు.
3వ రోజు ఉదయం శ్రీ మలయప్పస్వామివారు సింహవాహనంపై శ్రీవారు దర్శనమివ్వనున్నారు. అదే రోజు రాత్రి శ్రీ మలయప్పస్వామివారిని ముత్యపుపందిరి వాహనంపై ఊరేగిస్తారు. 4వ రోజు ఉదయం శ్రీమలయప్పస్వామివారు ఉభయదేవేరులతో కలిసి కల్పవృక్ష వాహనంపై రాత్రి సర్వభూపాల వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. 5వ రోజు ఉదయం శ్రీవారు మోహినీరూపంలో దర్శనిస్తారు. రాత్రి గరుడవాహనంలో జగన్నాటక సూత్రధారియైన శ్రీ మలయప్పస్వామివారు తిరుమాడ వీధులలో నింపాదిగా ఊరేస్తారు.
6వ రోజు ఉదయం శేషాచలాధీశుడు రాముని అవతారంలో తన భక్తుడైన హనుమంత వాహనంపై మాడ విధుల్లో భక్తులకు దర్శనమిస్తాడు. అదే రోజు సాయింత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామికి పుష్పకవిమాన సేవ నిర్వహిస్తారు. ఈ పుష్పక విమానం మూడు సంవత్సరాలకు ఒకసారి వచ్చే అధిక మాసం సందర్భంగా నిర్వహించే నవరాత్రి బ్రహ్మోత్సవాలలో నిర్వహిస్తారు. అదే రోజు రాత్రి వేంకటాద్రీశుడు గజవాహనంపై శ్రీవారు ఊరేగుతారు.
7వ రోజున ఉదయం శ్రీవారు సూర్యప్రభ వాహనంపై విహరించనున్నారు. అదే రోజు రాత్రి శ్రీమలయప్పస్వామివారు చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. 8వ రోజు ఉదయం శ్రీనివాసుడు స్వర్ణరథాన్ని అధిరోహించి భక్తులకు దర్శనిస్తాడు. అదే రోజు రాత్రి శ్రీమలయప్పస్వామివారిని అశ్వవాహనంపై ఊరేగిస్తారు. 9వ రోజు ఉదయం చక్రస్నానం నిర్వహిస్తారు.












Click it and Unblock the Notifications