తిరుపతి బై పోల్ బీజేపీ అభ్యర్థి కన్ఫామ్: రత్న ప్రభ పేరు ఖరారు, అధికారిక ప్రకటనే తర్వాయి
తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక కోసం ఇప్పటికే టీడీపీ, వైసీపీ అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. బీజేపీ మాత్రం అభ్యర్థి ఎంపిక కోసం భారీగా కసరత్తు చేసింది. మాజీ ఐఏఎస్ అధికారి రత్నప్రభ పేరును ఖరారు చేశారు. కానీ దీనిపై బీజేపీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
రత్నప్రభ ఖరారు..
ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాకు చెందిన రత్నప్రభ 1981 క్యాడర్ కర్ణాటక ఐఏఎస్ అధికారి. రిటైరయ్యే సమయానికి కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించారు. డిప్యుటేషన్పై ఏపీలోనూ ఉన్నతస్థాయిలో విధులు నిర్వర్తించారు. పదవీ విరమణ తర్వాత ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తిరుపతి ఉప ఎన్నిక కోసం రత్నప్రభను అభ్యర్థిగా బీజేపీ హైకమాండ్ ఎంపిక చేసింది. దాసరి శ్రీనివాసులుకు ప్రచార కమిటీలో స్థానం కల్పించింది.
ఫైర్ బ్రాండ్ ఆఫీసర్
రత్నప్రభకు ఫైర్ బ్రాండ్ అధికారిణి అని, ముక్కుసూటిగా వ్యవహరిస్తారని గుర్తింపు ఉంది. వైసీపీ, టీడీపీలకు దీటుగా ఉండాలంటే రత్నప్రభ వంటి వ్యక్తి సరైన అభ్యర్థి అని బీజేపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. రత్న ప్రభ అభ్యర్థిత్వానికి సంబంధించి రేపు లేదా ఎల్లుండి ప్రకటించనున్నారు. తిరుపతి ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి బీజేపీలో ప్రధానంగా నలుగురి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. నలుగురిలో రిటైర్డు ఐఏఎస్ అధికారులు దాసరి శ్రీనివాసులు, రత్నప్రభ, రిటైర్డు డీజీపీ కృష్ణప్రసాద్ వుండగా మరొకరు తిరుపతి బీజేపీ నేత మునిసుబ్రమణ్యం వున్నారు.
విద్యావంతులు ఎక్కువ
తిరుపతి విద్యా కేంద్రం కావడంతో ఇక్కడ ఉన్నత విద్యావంతులు ఎక్కువ. నియోజకవర్గ పరిధిలోని ఓటర్లలో విద్యావంతులు అధికంగా వుంటున్నారు. ఈ కారణంతో ఇక్కడ ఏ పార్టీ అయినా విద్యాధికులనే అభ్యర్థులుగా ఎంచుకుంటున్నాయి. తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి బీజేపీ నుంచే బరిలోకి దించుతున్నారు.
వైసీపీ, టీడీపీ నుంచి వీరే
తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ రావు కరోనాతో కన్నుమూశారు. దుర్గాప్రసాద్ అకాల మరణంతో తిరుపతి లోక్సభకు ఎన్నిక అనివార్యమైంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నారు. అందరికంటే ముందుగా టీడీపీ లోక్సభ అభ్యర్థిగా పనబాక లక్ష్మీని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. వైసీపీ అభ్యర్థిగా తన ఫిజియోథెరపిస్టు డాక్టర్ ఎం గురుమూర్తి పేరును సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. తిరుపతి లోక్సభ స్థానం పరిధిలో చిత్తూరు జిల్లాలోని మూడు అసెంబ్లీ సెగ్మెంట్లు తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు.. నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి సెగ్మెంట్లు ఉన్నాయి.