తిరుమలలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్- అపాయింట్మెంట్ కోసం రంగంలో దిగిన చంద్రబాబు?
తిరుపతి: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్.. రాష్ట్ర పర్యటనకు వచ్చారు. మూడు రోజుల పాటు ఆయన రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో పర్యటిస్తారు. పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. తన పర్యటన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ జ్యుడీషియల్ అకాడమీని ఆయన ప్రారంభించనున్నారు. ఈ నెల 30వ తేదీన దీనికి ముహూర్తం పెట్టారు.

తిరుమలతో శ్రీకారం..
తన మూడు రోజుల రాష్ట్ర పర్యటనను సీజేఐ డీవై చంద్రచూడ్ తిరుమలతో శ్రీకారం చుట్టారు. ఈ సాయంత్రం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం రోడ్డు మార్గంలో తిరుమలకు వచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, తదితరులు ఆయనకు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. శాలువ కప్పి సాదరంగా ఆహ్వానించారు. వైవీ సుబ్బారెడ్డితో పాటు జిల్లా అధికార, పోలీసు, జ్యుడీషియరీ అధికారులు ఆయనకు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.

శ్రీవారి దర్శనం..
విమానాశ్రయం నుంచి తిరుమలకు చేరుకున్నారు సీజేఐ. రాత్రి పద్మావతి అతిథిగృహంలో బస చేయనున్నారు. బుధవారం తెల్లవారు జామున శ్రీవారిని దర్శంచుకోనున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. 30వ తేదీన గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని చినకాకానిలో నిర్మించిన ఏపీ జ్యుడీషియరీ అకాడమీని సీజేఐ ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా పలువురు అధికారులు పాల్గొననున్నారు.

నిర్మాణ పనుల పర్యవేక్షణ..
ఈ నేపథ్యంలో అకాడమీ భవన నిర్మాణ పనులను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, జస్టిస్ సీ ప్రవీణ్కుమార్, జస్టిస్ దుర్గాప్రసాదరావు, జస్టిస్ రావు రఘునందన్ రావు, జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ ఇదివరకే పరిశీలించారు. నిర్మాణ పనులన్నీ పూర్తయ్యాయి. తరగతి గదులు, ఫ్యాకల్టీ ఛాంబర్ను వారు పరిశీలించారు.

అపాయింట్మెంట్ కోసం..
కాగా- మూడు రోజుల పాటు సీజేఐ రాష్ట్ర పర్యటనలో ఉండబోతోన్నందున- ఆయనను కలుసుకునే ప్రయత్నాలను మొదలు పెట్టింది ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ. సీజేఐ అపాయింట్మెంట్ను కోరనుంది. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, శాంతిభద్రతల అంశాన్ని టీడీపీ నాయకులు సీజేఐ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనితో స్వయంగా టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడే అపాయింట్మెంట్ కోసం ప్రయత్నాలు సాగిస్తోన్నట్లు సమాచారం.

అఖిలపక్ష భేటీలోనూ తీర్మానం..
రాష్ట్ర పర్యటనకు వచ్చిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుందని అఖిలపక్ష నాయకులు సైతం ఈ మధ్యాహ్నమే నిర్ణయించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాల గురించి ఆయన దృష్టికి తీసుకెళ్లాలని వారు స్పష్టం చేశారు. రాజ్యాంగం, చట్టాలు, న్యాయాలకు విరుద్ధంగా వైసీపీ ప్రభుత్వం పరిపాలన సాగిస్తోందని, అందుకే సీజేఐని కలిసి రాష్ట్ర స్థితిగతులను వివరిస్తామని అన్నారు. ఆయా అంశాలతో కూడిన వినతిపత్రాన్ని అందించాలని ఉమ్మడి నిర్ణయం తీసుకున్నారు.












Click it and Unblock the Notifications