ఏపీలో కరోనా: ఒకే వ్యక్తికి రెండోసారి వైరస్ కాటు - అతను టీటీడీ ఉద్యోగి - రాష్ట్రంలో తొలిసారి ఇలా..
''ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటివరకు ఒకే వ్యక్తికి రెండోసారి కరోనా సోకిన కేసులు ఎక్కడా నమోదు కాలేదు'' అని ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సీఎస్ జవహర్ రెడ్డి ప్రకటించిన కొద్ది గంటలకే సీన్ నివర్స్ అయింది. రాష్ట్రంలో తొలిసారి ఒకే వ్యక్తికి రెండో సారి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడం కలకలం రేపుతున్నది. కలియుగ వైకుఠం తిరుమలలోనే ఈ తరహా అరుదైన కేసు బయటపడటం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది.

టీటీడీ సెక్యూరిటీ ఉద్యోగి..
తిరుమల తిరుపతి దేస్థానం(టీటీడీ) భద్రతా విభాగానికి చెందిన ఉద్యోగికి రెండోసారి కరోనా వైరస్ సోకింది. శ్రీవారి ఆలయంలో విధులు నిర్వహిస్తోన్న ఆ ఉద్యోగి.. గతంలో జూన్ 27న కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యారు. ఆ సమయంలో ఎటువంటి లక్షణాలూ లేనప్పటికీ టెస్ట్లో పాజిటివ్గా తేలారు. కొద్ది రోజుల్లో వ్యాధి నుంచి కోలుకున్న ఆయన తిరిగి విధుల్లో చేరారు. అయితే ఇటీవల మళ్లీ జ్వరం రావడంతో టెస్ట్ చేయించుకోగా.. రెండోసారి పాజిటివ్ అని తేలింది.

తిరుమలలో టెన్షన్..
లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా దర్శనాలకు అనుమతించడం తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో తిరుమల తిరుపతి దేస్థానం అర్చకులు, ఉద్యోగులు ఒక్కొక్కరుగా ఇన్ఫెక్షన్ కు గురవుతున్నారు. తాజాగా సెక్యూరిటీ సిబ్బందిలో ఒకరికి రెండోసారి కూడా వైరస్ సోకిందన్న విషయం నిర్ధారణ కావడంతో ఉద్యోగుల భయాందోళన రెట్టింపయింది. రెండోసారి కరోనా సోకిన సదరు ఉద్యోగిని చికిత్స నిమిత్తం శ్రీనివాసం కోవిడ్ సెంటర్కు తరలించారు.

రెండోసారి కరోనా ఎలా?
కొవిడ్ వ్యాధి నుంచి కోలుకున్న వాళ్లలో చాలా అరుదుగా మాత్రమే రెండవసారి పాజిటివ్ వచ్చే అవకాశాలున్నాయని సైంటిస్టులు, డాక్టర్లు చెబుతున్నారు. రెండోసారి కరోనా వచ్చినప్పటికి వారిలో ఎలాంటి రోగ లక్షణాలు కనిపించవని, వారినుంచి వైరస్ ఇతరులకు సోకే ప్రమాదం లేదని తేల్చి చెప్పారు. ‘‘క్లినికల్ ఇన్ఫెక్షస్ డీసీజెస్'' జర్నల్లో ప్రచురించిన నివేదికలో ఈ వివరాలను వెల్లడించారు. కరోనా సోకిన వ్యక్తి శరీరం వేగంగా న్యూట్రలైజింగ్ యాంటీ బాడీస్ను విడుదల చేస్తుందని, ఇన్ఫెక్షన్ తగ్గిన ఒకటి లేదా రెండు నెలల తర్వాత యాంటీ బాడీస్ సంఖ్య తగ్గిపోతుందని తెలిపారు. శరీరంనుంచి వైరస్లను బయటకు పంపేసే ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ‘రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పాలిమరేస్ చైన్ రియాక్షన్' టెస్టుల్లో కోలుకున్న వ్యక్తులకు కూడా కొన్ని వారాల తర్వాత పాజిటివ్ వస్తుందని పేర్కొన్నారు. అయితే, టీటీడీ ఉద్యోగికి మాత్రం రెండో సారి టెస్టులకు ముందు రోగ లక్షణమైన జ్వరం రావడం గమనార్హం.

మరణాలు తగ్గించడమే టార్గెట్..
కేసులు భారీగా నమోదవుతోన్న రాష్ట్రాల్లో.. ఏపీలో మాత్రమే మరణాల రేటు తక్కువగా ఉందని, కరోనా వల్ల చనిపోయేవారి సంఖ్యను తగ్గించడమే టార్గెట్ గా విధానాలను రూపొందించామని ఏపీ ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. కరోనా సోకకుండా ప్రజల్ని చైతన్యం చేస్తున్నామని, 104 కాల్ సెంటర్లు, హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని, 217 ఆస్పత్రుల్లో హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేశామని, 14 వేలకు పైగా ఫోన్ కాల్స్ కు సమాధానాలిచ్చామని తెలిపారు. రెండోసారి కరోనా కు గురైన వ్యక్తిపై ఆరోగ్య శాఖ ప్రకటన చేయాల్సిఉంది.












Click it and Unblock the Notifications