భక్తులకు గమనిక: కోవిడ్ వ్యాక్సినేషన్ లేదా నెగెటివ్ సర్టిఫికెట్ ఉంటేనే తిరుమలకు అనుమతి
తిరుపతి: శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కానీ, దర్శనానికి 48 గంటల ముందు చేసుకున్న ఆర్టిపిసిఆర్ పరీక్ష నెగిటివ్ సర్టిఫికేట్ కానీ తప్పనిసరిగా తీసుకురావాలని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) స్పష్టం చేసింది. ఇదివరకే టీడీ ఈ విషయాన్ని తెలియజేసిన విషయం విదితమే.
కొంతమంది భక్తులు నెగెటివ్ సర్టిఫికేట్ లేకుండా స్వామివారి దర్శనం కోసం వస్తుండడంతో అలిపిరి చెక్ పాయింట్ వద్ద నిఘా, భద్రతా సిబ్బంది తనిఖీ చేసి అటువంటి వారిని వెనక్కు పంపాల్సి వస్తోంది. దీనివలన అనేకమంది భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొంది.

ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ - 19 మూడవ వేవ్ ఒమిక్రాన్ రూపంలో దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్న నేపథ్యంలో హెచ్చరికలు జారీ చేసింది. ఖచ్చితంగా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ లేదా దర్శనానికి 48 గంటల ముందు చేసుకున్న ఆర్టిపిసిఆర్ పరీక్ష నెగెటివ్ సర్టిఫికేట్ను అలిపిరి చెక్ పాయింట్ వద్ద చూపించిన వారిని మాత్రమే తిరుమలకు అనుమతిస్తారు.
ఈ క్రమంలో భక్తులు, ఉద్యోగుల, వేలాది మంది సహ భక్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటి సిబ్బందికి సహకరించాలని కోరడమైనది.
టిటిడికి సంబంధించిన ఇతర ఆలయాల్లో కూడా ఈ కోవిడ్ నిబంధనలు విధిగా పాటించాలని భక్తులను కోరింది.
శ్రీవారిని దర్శించుకున్న శ్రీలంక ప్రధాని మహింద రాజపక్సే
శ్రీలంక ప్రధాన మంత్రి మహింద రాజపక్సే తన సతీమణి షిరాంతి రాజపక్సేతో కలిసి శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం ఆలయం వద్దకు చేరుకున్న శ్రీలంక ప్రధానికి టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, సివిఎస్వో గోపినాథ్ జెట్టి మహద్వారం వద్ద సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
శ్రీలంక ప్రధాని శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఆ తరువాత జెఈవో తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటం అందించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు నారాయణస్వామి, అర్బన్ ఎస్పీ వెంకట అప్పల నాయుడు, ఆలయ డెప్యూటీ ఈవో రమేష్ బాబు, రిసెప్షన్ డెప్యూటీ ఈఓ లోకనాథం తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications