కంటిచూపుతో దొంగఓటరును పట్టుకోవడం ఏదైతే ఉందో.. ఆవిడ సీబీఐకి పర్ఫెక్ట్: మహేష్ కత్తి
తిరుపతి: తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా చెలరేగిన దొంగ ఓట్లు, నకిలీ ఓటర్ల కలకలం సద్దు మణగట్లేదు. ప్రతిపక్ష తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ-జనసేన నేతలు ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి సైతం తీసుకెళ్లారు. దీనిపై ఈసీ ఆరా తీస్తోంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దొంగ ఓట్లను వేయించడానికి వందలాదిమందిని తిరుపతికి తరలించిందంటూ టీడీపీ, బీజేపీ నేతలు ఆరోపించారు. నెల్లూరు, తిరుపతి జిల్లాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో దొంగ ఓట్లు వేయడానికి పలువురు ప్రయత్నించారంటూ విమర్శించారు.
ఈ సందర్భంగా బీజేపీకి చెందిన శాంతిరెడ్డి, ఆ పార్టీ అభ్యర్థిని రత్నప్రభ, తెలుగుదేశం తరఫున పోటీ చేసిన పనబాక లక్ష్మి, తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ప్రజాస్వామ్యాన్ని కాపాడారంటూ ఆయా పార్టీలకు చెందిన నాయకులు ప్రశంసిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకోకముందే వారిని వాహనాల్లో నిలిపివేశారని, సకాలంలో గుర్తించగలిగారంటూ టీడీపీ, బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ నేతల పోల్ మేనేజ్మెంట్, అక్రమాలను తాము సమర్థవంతంగా అడ్డుకోగలిగామని చెబుతున్నారు.

ఈ పరిణామాల మధ్య చిత్తూరు జిల్లాకు చెందిన దళిత నాయకుడు మహేష్ కత్తి కీలక వ్యాఖ్యలు చేశారు. వాసన చూసి దొంగ ఓటు పట్టుకోవడం. కంటిచూపుతో కరోనా మాస్క్ వేసుకున్నప్పటికీ దొంగ ఓటరును గుర్తించడం ఎలా సాధ్యమైందంటూ ప్రశ్నించారు. ఇదంతా పక్కా ప్లాన్గా ఆయన అభివర్ణించారు. టీడీపీ, బీజేపీ నేతలు ముందే వేసుకున్న ప్లాన్ ప్రకారం.. దొంగ ఓటర్ల వ్యవహారాన్ని తెర మీదికి తీసుకొచ్చారని ఆరోపించారు. దొంగ ఓటర్లతో ఓట్లు వేయించుకోవాల్సిన అధికార పార్టీకి లేదనే తాను భావిస్తున్నానని స్పష్టం చేశారు.
Recommended Video
వాసన చూసి దొంగ ఓటు పట్టుకోవడం, కంటిచూపుతో కరోనా మాస్క్ వేసుకున్నప్పటికీ దొంగ ఓటరును గుర్తించిన ఆవిడను వెంటనే సీబీఐలో చేర్చాలని అన్నారు. ఇది తన డిమాండ్గా ఆయన పేర్కొన్నారు. వాసన చూసి దొంగ ఓటు పట్టుకోవడం. కంటిచూపుతో కరోనా మాస్క్ వేసుకున్న దొంగ ఓటర్ని గుర్తించడం ఏదైతే ఉందో...ఆవిడని సిబిఐలో జాయిన్ చేసుకోవాలి. ఇది నా డిమాండ్.. అనే వ్యాఖ్యలను మహేష్ కత్తి.. తన అధికారిక ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. అలాంటి సునిశిత పరిశీలనాశక్తి ఉన్న నేతలు సీబీఐలో ఉండాలనే అభిప్రాయాన్ని ఆయన పరోక్షంగా వ్యక్తం చేశారు. పనబాక లక్ష్మి, రత్నప్రభతో పాటు బీజేపీ నాయకులు శాంతా రెడ్డి పలు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి దొంగ ఓట్లు వేయడానికి వచ్చిన వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి.












Click it and Unblock the Notifications