TTD: రికార్డు స్థాయిలో పెరిగిన వెంకన్న ఆస్తులు - ఇవీ లెక్కలు..!!
Tirumala: తిరుమల శ్రీవారి ఆస్తుల విలువ రికార్డు స్థాయిలో నమోదు అయ్యింది. గత నాలుగేళ్లలో భారీగా పెరిగాయి. గణనీయంగా పెరిగిన భక్తుల రద్దీతో పాటు హుండీ ఆదాయం కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. తిరుమలేశుడికి బ్యాంకుల్లో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లు, గోల్డ్ డిపాజిట్లను టీటీడీ ఈవో ధర్మారెడ్డి ప్రకటించారు. టీటీడీ పాలనపై ఆరోపణలు చేసిన టీడీపీ నేతలను కూడా టీటీడీ ఈఓ ధర్మారెడ్డి చర్చకు ఆహ్వానించారు.
పూర్తి పారదర్శకంగా
తిరుమల తిరుపతి దేవస్థానంలో పూర్తి పారదర్శకంగా పాలన జరుగుతోందని, విస్తృతంగా ధర్మప్రచారంతోపాటు భక్తుల సౌకర్యాలకు పెద్దపీట వేస్తున్నామని, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. టీడీపీ అధికార ప్రతినిధి శ్రీ ఆనం వెంకటరమణారెడ్డి చేసిన ఆరోపణలపై ఈవో స్పందించారు.

తనపై అవాస్తవాలతో కూడిన వ్యక్తిగత ఆరోపణలు చేయడం బాధాకరమని, వాస్తవాలు తెలుసుకుని ఉంటే బాగుండేదని అన్నారు. ఆయన ఆరోపణలను ఈవో ఖండించారు. ఈవోగా పనిచేయడానికి తనకు అర్హత లేదని ఆరోపించారని ఇది వాస్తవం కాదన్నారు. దేవాదాయ చట్టం 107వ సెక్షన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో జిల్లా కలెక్టర్ లేదా ఆ పోస్టుకు సమానమైన హోదా ఉన్నవారు ఈవోగా పనిచేయడానికి అర్హులని తెలిపారు. తాను 1991 బ్యాచ్ సివిల్ సర్వీసెస్ ఐడిఇఎస్ అధికారినని, 33 సంవత్సరాల అనుభవం ఉందని చెప్పారు.
అభివృద్ధి కార్యక్రమాలు
గత నాలుగున్నర సంవత్సరాల కాలంలో టీటీడీలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామన్నారు. తిరుమలలో దర్శన దళారులను అరికట్టామని, శ్రీవాణి ట్రస్టుకు ఇప్పటివరకు రూ.1,021 కోట్ల విరాళాలు అందాయని తెలిపారు. ఇప్పటివరకు 550 ఆలయాలు నిర్మించడం జరిగింది. 3 వేలకు పైగా ఆలయాలు వివిధ దశల్లో ఉన్నాయి. 176 పురాతన ఆలయాల జీర్ణోద్ధరణ చేపట్టామని వివరించారు. వైజాగ్, భువనేశ్వర్, జమ్మూ తదితర ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాలు నిర్మించామని చెప్పారు. అదేవిధంగా దాతల సహకారంతో రూ.140 కోట్లతో తిరుమలలో మ్యూజియంను ఆధునీకరిస్తున్నామని, రూ.25 కోట్లతో అలిపిరి నడకమార్గంలో పైకప్పు, రూ.25 కోట్లతో నూతన పరకామణి భవనం, రూ.15 కోట్లతో బర్డ్ ఆసుపత్రిలో నూతన వైద్యపరికరాలు ఏర్పాటు చేశామని వివరించారు.
పెరిగిన డిపాజిట్లు
2019 జూన్ నుండి 2023 అక్టోబరు వరకు దాదాపు రూ.4800 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు, దాదాపు 3885 కిలోల బంగారం డిపాజిట్లు పెరిగాయని ఈవో వెల్లడించారు. ఎస్వీబీసీని విస్తృతంగా భక్తుల్లోకి తీసుకెళ్లామని, భక్తులు స్వచ్ఛందంగా రూ.50 కోట్లకు పైగా విరాళాలు అందిచారని చెప్పారు. స్విమ్స్లో రూ.77 కోట్లతో నూతనంగా కార్డియో, న్యూరో బ్లాక్ నిర్మిస్తున్నామని, అదేవిధంగా, రూ.197 కోట్లతో నాలుగేళ్లలో దశలవారీగా మొత్తం భవనాలను ఆధునీకరిస్తామని ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయలో 2 వేలకు పైగా గుండె ఆపరేషన్లు నిర్వహించామని, 8 గుండె మార్పిడి ఆపరేషన్లు చేశామని, చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి రూ.175 కోట్ల విరాళాలు అందాయని తెలిపారు.












Click it and Unblock the Notifications