టీటీడీ చరిత్రలో తొలిసారి: ఒక్కరోజే రూ.6 కోట్లకు పైగా తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం
తిరుపతి: కలియుగ వైకుంఠంలా అలరారుతోన్న పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రికార్డులు తిరగరాస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలోనే ఎప్పుడూ లేనివిధంగా ఒక్కరోజే 6 కోట్ల 18 లక్షల రూపాయల మేర రెవెన్యూ హుండీ ద్వారా లభించింది. ఈ స్థాయిలో హుండీ ఆదాయం రావడం ఇదే తొలిసారి. ఈ క్రమంలో పది సంవత్సరాల కిందట నమోదైన ఒక్కరోజు రికార్డుస్థాయి హుండీ ఆదాయం తెరమరుగైంది.
కరోనా వైరస్ వ్యాప్తి చెందిన పరిస్థితుల కారణంగా రెండు సంవత్సరాల పాటు టీటీడీ కొంత మేర నిధుల కొరతను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. నెలల తరబడి శ్రీవారిని దర్శించడానికి తిరుమలకు వచ్చే భక్తుల రాకపోకలపై నిషేధం విధించడం వల్ల రోజువారీ ఆదాయం గణనీయంగా తగ్గింది. ఇప్పుడా పరిస్థితులు లేవు. శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. రోజూ 75 వేల మందికి పైగా భక్తులు ఏడుకొండలవాడిని దర్శించుకుంటోన్నారు.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. క్యూ కాంప్లెక్సుల బయట క్యూ లైనులో భక్తులు వేచి ఉండేంతటి రద్దీ ఏర్పడింది. సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. సోమవారం 77,907 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 38,267 మంది స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. తలనీలాలను సమర్పించుకున్నారు. ఇక హుండీ ఆదాయం రికార్డులను నెలకొల్పింది. ఒక్క రోజులోనే 6.18 కోట్ల రూపాయల రెవెన్యూ అందింది.
2012 ఏప్రిల్ 1వ తేదీన లభించిన టీటీడీకి హుండీ ద్వారా అందిన ఒక్కరోజు ఆదాయం 5 కోట్ల 73 లక్షల రూపాయలు. ఇప్పుడది తెరమరుగైంది. కాగా- నాలుగు నెలలుగా శ్రీవారి హుండీ ఆదాయం వంద కోట్ల రూపాయలను అధిగమిస్తోంది. ఈ ఏడాది మార్చి నుంచి వరుసగా ప్రతి నెలా హుండీ రెవెన్యూ వంద కోట్ల రూపాయలను దాటుతోంది. మార్చిలో 128 కోట్ల రూపాయలు, ఏప్రిల్లో 127.50 కోట్ల రూపాయలు, మేలో 130.50 కోట్ల రూపాయల హుండీ ఆదాయం రికార్డయింది. జూన్లో కూడా 123.76 కోట్ల రూపాయలు అందాయి.