కొత్త కొత్తగా కొడాలి నాని: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ మంత్రి
తిరుపతి: మాజీ మంత్రి కొడాలి నాని. ఈ పేరు వినగానే గుబురు గడ్డం, మీసం, తలనిండా ఒత్తయిన జుట్టుతో భారీ ఆకారం, అంతే గంభీర స్వరం కళ్ల ముందు కనిపిస్తుంటుంది. బహిరంగ సభల్లో గానీ, విలేకరుల సమావేశాల్లో గానీ ఉగ్రరూపంలో ప్రదర్శిస్తుంటారు. మొన్నటికి మొన్న అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో ప్రతిపక్ష పార్టీలపై చెలరేగిపోయారాయన. ఘాటు విమర్శలతో విరుచుకుపడ్డారు. తనదైన శైలిలో తెలుగుదేశం పార్టీ నాయకులకు చురకలు అంటించారు. అలాంటి కొడాలి నాని.. పూర్తి భిన్నంగా కనిపించారు.
ఈ మధ్యాహ్నం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామి వారికి తలనీలాలను సమర్పించారు. దీనితో ఆయనను మొదట చాలామంది గుర్తు పట్టలేకపోయారు. ఫలానా వ్యక్తి కొడాలి నాని అని చెబితే గానీ గుర్తు పట్టడం కష్టం అనిపించింది. శ్రీవారికి మొక్కులు చెల్లించడానికి ఆయన తిరుమలకు వచ్చారు. పద్మావతి అతిథి గృహంలో బస చేశారు. ఈ మధ్యాహ్నం కల్యాణకట్టలో తలనీలాలను సమర్పించుకున్నారు. అనంతరం శ్రీవారి సేవలో పాల్గొన్నారు.
ఆలయం వెలుపల తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఏడుకొండలవాడిని ప్రార్థించినట్లు చెప్పారు. రాష్ట్రం మొత్తం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నానని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, వైసీపీ ప్రభుత్వం బాగుండాలని ప్రార్థించానని పేర్కొన్నారు. తమది ప్రజల ప్రభుత్వమని అన్నారు. ప్రజల సంక్షేమం కోసం శ్రమిస్తుంటుందని చెప్పారు.
అందుకే సకాలంలో వర్షాలు కురుస్తున్నాయని, తమ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ప్రతి సంవత్సరం కూడా రాష్ట్రంలోని అన్ని నీటి ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయని చెప్పారు. ప్రకృతి సైతం ప్రభుత్వానికి సహకరిస్తోందని కొడాలి నాని వ్యాఖ్యానించారు. తిరుమలలో రాజకీయాల గురించి మాట్లాడటం సరైంది కాదని ఓ ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. పళ్లు కాసే చెట్లుకే రాళ్ల దెబ్బలు అధికంగా తగులుతుంటాయని పేర్కొన్నారు.