శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులపై టీటీడీ కీలక నిర్ణయం?
తిరుపతి: కలియుగ వైకుంఠం తిరుమలలో వెలసిని తిరుమలేశుడి ఆలయం మాజీ ప్రధాన అర్చకుడు డాక్టర్ రమణ దీక్షితులు కేసు వ్యవహారంలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఓ కీలక నిర్ణయాన్ని తీసుకోవడానికి సిద్ధమౌతోంది.. ఆయనపై సుప్రీంకోర్టులో వేసిన అప్పీల్ ను వెనక్కి తీసుకోవాలని సూచనప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం. అప్పీల్ ను వెనక్కి తీసుకోవడంతో పాటు ఆయనను మళ్లీ ప్రధాన అర్చకుడిగా నియమించడానికి గల అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి గల న్యాయ పరమైన అడ్డంకులను పరిష్కరించుకోవడానికి పాలక మండలి చర్యలు చేపట్టినట్లు చెబుతున్నారు. లేదా ఇదివరకటి పాలక మండలి ఇచ్చిన ఉత్వర్వులను రద్దు చేయవచ్చని తెలుస్తోంది.

త్వరలో కీలక ప్రకటన..
శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో స్వామి వారికి పట్టువస్త్రాలను సమర్పించడానికి ఈ నెల 30వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమలకు రానున్నారు. ఈ సందర్భంగా రమణ దీక్షితుల పదవీ విరమణ వివాదంపై ఓ స్పష్టమైన ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వం తనను బలవంతంగా పదవీ విరమణ చేయించిన విషయంపై రమణ దీక్షితులు హైకోర్టులో న్యాయపోరాటం చేశారు. శతాబ్దాల కాలంగా కొనసాగుతూ వస్తోన్న మిరాశీ వ్యవస్థను పునరుద్ధరించాలని కోరుతూ ఆయన హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయగా.. తీర్పు ఆయనకు అనుకూలంగా వెలువడిన విషయం తెలిసిందే.

సుప్రీంకోర్టులో పెండింగ్ లో అప్పీల్
హైకోర్టు తీర్పుపై టీటీడీ పాలక మండలి దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. పెండింగ్ లో ఉన్న అప్పీల్ ను వెనక్కి తీసుకోవడానికి టీటీడీ పాలక మండలి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సుముఖంగా ఉన్నారని అంటున్నారు. ఈ అప్పీల్ వెనక్కి తీసుకుని.. హైకోర్టు తీర్పు అమలు చేయాలని, దీనికి అనుగుణంగా రమణ దీక్షితులు మళ్లీ శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడిగా నియమించడానికి వీలు కల్పించే దిశగా త్వరలోనే ఓ స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం.

రమణ దీక్షితులకు న్యాయం చేయాలంటూ..
వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన కొద్దిరోజుల కిందటే టీటీడీ పాలక మండలి సమావేశమైంది. ఈ సమావేశంలో రమణ దీక్షితుల బలవంతపు పదవీ విరమణ అంశం చర్చకు వచ్చింది. ఈ కేసు ప్రస్తుతం హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో ఉన్నందున ఇప్పటికిప్పుడు ఎలాంటి నిర్ణయాన్నీ తీసుకోలేమని పాలక మండలి సభ్యులు అభిప్రాయ పడ్డారు. ఈ అంశం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి వెళ్లగా.. సుప్రీంకోర్టులో వేసిన అప్పీల్ ను వెనక్కి తీసుకోవాలని సూచించినట్లు చెబుతున్నారు. ముందు నుంచీ తమ పార్టీకి మద్దతు ఇచ్చిన నేపథ్యంలో.. రమణ దీక్షితులకు ఎలాగైనా న్యాయం జరిగేలా చూడాలని వైఎస్ జగన్ టీటీడీ ఛైర్మన్ ను సూచించారని అంటున్నారు.

ఆ ఆరోపణలే ప్రధాన కారణం..
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పింక్ డైమండ్ సహా కొన్ని రకాల నగలు, ఆభరణాలు మాయం అయ్యాయంటూ 2018లో అప్పటి ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. పవిత్రమైన శ్రీవారి పోటులో నిబంధనలకు, ఆగమశాస్త్రాలకు విరుద్ధంగా తవ్వకాలు చేపట్టారని అన్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పుట్టా సుధాకర్ యాదవ్ సారథ్యంలో ఏర్పాటైన నాటి పాలక మండలి రమణ దీక్షితులకు పదవీ విరమణ కల్పించింది. 65 సంవత్సరాల కంటే అధిక వయస్సున్న అర్చుకులందరూ పదవీ విరమణ చేయాలంటూ తీర్మానాన్ని ఆమోదించింది. దీనిపై రమణ దీక్షితులు న్యాయపోరాటం చేసి, విజయం సాధించారు. దీనిపై అదే పాలక మండలి సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది.












Click it and Unblock the Notifications