1381 కేజీలబంగారం విషయంలో స్పందిచిన టీటీడీ ! ఆ గోల్డ్ మాదే, కానీ..మాది కాదు : టీటీడీ ఈవో
తిరుపతి: ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో.. తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లా వెప్పంపట్టులో ఓ వాహనంలో తరలిస్తోన్న 1381 కేజీల బంగారం వ్యవహారంపై తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వాహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ ఆసక్తికర వ్యాఖ్యానాలు చేశారు. ఆ బంగారం మాదే కానీ.. మాది కాదు. ఆ బంగారంతో మాకు సంబంధమే లేదు..అని చెప్పారు. ఆ బంగారానికి పూర్తి బాధ్యత వహించాల్సింది సంబంధిత బ్యాంకు అధికారులేనని ఆయన స్పష్టం చేశారు. ఆ బంగారం తమ వద్ద జమ చేసిన తరువాతే టీటీడీది అవుతుందని అన్నారు.

అనేక అనుమానాలు..రాజకీయ కోణాలు
తమిళనాడు తొలిదశ పోలింగ్ కు సరిగ్గా ముందు రోజు రాత్రి తిరునెల్వేలి జిల్లాలోని వెప్పంపట్టు చెక్ పోస్ట్ వద్ద ఎన్నికల అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఈ బంగారం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఏకమొత్తం 1381 కేజీల బంగారాన్ని ఓ ప్రైవేటు వాహనంలో తరలిస్తుండటంతో.. అది కాస్తా సంచలనంగా మారింది. దీనిపై అనేక అనుమానాలు తలెత్తాయి. చివరికి- ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం.. ఇందులో జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఉదంతంపై సమగ్ర విచారణ నిర్వహించడానికి ఆయన ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి డాక్టర్ మన్మోహన్ సింగ్ ను నియమించిన విషయం తెలిసిందే. ఈ ఉదంతం రాజకీయ రంగును కూడా పులుముకొంది. అధికార పార్టీ అక్రమంగా ఈ బంగారాన్ని తరలిస్తోందంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.

టీటీడీ ఏం చెబుతోంది?
ఈ వ్యవహారం క్రమంగా ముదిరి పాకాన పడుతున్న పరిస్థితుల్లో టీటీడీ అధికారులు మేల్కొన్నారు. ఈ బంగారం తరలింపుపై నెలకొన్న వివాదాన్ని తెర దించే ప్రయత్నం చేశారు. టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ సోమవారం మధ్యాహ్నం తిరుపతిలోని పరిపాలనా భవనంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుత.. తమిళనాడులో ఎన్నికల అధికారుల తనిఖీ సందర్భంగా పట్టుబడ్డ బంగారానికి టీటీడీకి ఏ మాత్రం సంబంధమే లేదని చెప్పారు. ఆ బంగారం తమదే అయినప్పటికీ.. తమది కాదని, ట్రెజరీలో జమ చేసిన తరువాతే.. అది టీటీడీది అవుతుందని అన్నారు.

మూడేళ్ల కాల పరిమితి ముగిసినందువల్లే..
శ్రీవారి భక్తుల నుంచి కానుకల రూపంలో అందే బంగారాన్ని జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని 2000 ఏప్రిల్ 1వ తేదీన అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని అన్నారు. మిగులు బంగారాన్ని మాత్రమే బ్యాంకుల్లో డిపాజిట్ చేయాల్సి ఉంటుందని, దాన్ని టీటీడీ అనుసరిస్తోందని చెప్పారు. బంగారాన్ని డిపాజిట్ చేసే పథకం కింద వేర్వేరు బ్యాంకుల్లో వాటిని జమ చేశామని చెప్పారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5,387 కేజీలు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో 1938 కేజీలు, పంజాబ్ నేషనల్ బ్యాంకులో 1311 కేజీల బంగారాన్ని డిపాజిట్ చేశామని అన్నారు. 2016 ఏప్రిల్ 1వ తేదీన పంజాబ్ నేషనల్ బ్యాంకులో మొత్తం 1311 కేజీల బంగారాన్ని మూడేళ్ల కాల పరమితితో డిపాజిట్ చేశామని సింఘాల్ తెలిపారు. ఈ మూడేళ్ల కాల పరమితిలో 1311 కేజీల బంగారం బ్యాంకు వడ్డీతో కలిపి 1381 కేజీలకు చేరిందని అన్నారు.

రవాణా బాధ్యత బ్యాంకర్లదే..
2015లో కేంద్ర ప్రభుత్వం గోల్డ్ మానిటైజేషన్ పథకాన్ని ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. బ్యాంకుల్లో ఉన్న టీటీడీ బంగారం మొత్తాన్ని ఆ పథకం కిందికి బదలాయించామని చెప్పారు. పంజాబ్ నేషనల్ బ్యాంకులో 2016 ఏప్రిల్ 1న డిపాజిట్ చేసిన 1311 కేజీల బంగారం కాల పరిమితి ఈ ఏడాది ఏప్రిల్ చివరి నాటికి ముగుస్తుందని అన్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంకుల్లో వడ్డీ శాతం అతి తక్కువగా ఉండటం వల్ల అక్కడి నుంచి బంగారాన్ని విత్ డ్రా చేయాలని నిర్ణయించుకున్నామని, ఈ నెల 18వ తేదీన బంగారాన్ని టీటీడీ ట్రెజరీలో జమ చేయాలని కోరుతూ పంజాబ్ నేషనల్ బ్యాంకు అధికారులకు లేఖ రాశామని అన్నారు. దీని ప్రకారం.. 17వ తేదీన రాత్రి పంజాబ్ నేషనల్ బ్యాంకు అధికారులు 1381 కేజీల బంగారాన్ని తిరుపతికి తరలించి ఉండొచ్చని చెప్పారు. ఆ బంగారం తమ ట్రెజరీలోకి చేరిన తరువాతే టీటీడీ సొంతమౌతుందని చెప్పారు. రవాణా బాధ్యత పూర్తిగా బ్యాంకర్లకే చెందినందు వల్ల దానికి జవాబుదారి బాధ్యత కూడా వారిదేనని అన్నారు.

కేంద్రం నుంచి కమీషన్..
బంగారాన్ని నిల్వ చేయడం, దాన్ని శుద్ధి చేయడం, రవాణా సౌకర్యాన్ని కల్పిస్తున్నందు వల్ల కేంద్ర ప్రభుత్వం బ్యాంకర్లకు 1.5 శాతం కమీషన్ ఇస్తోందని అన్నారు. ఈ రకంగా బ్యాంకర్లకు రవాణా ఖర్చులు అందుతాయని సింఘాల్ తెలిపారు. 18 తేదీన తెల్లవారు జామున పంజాబ్ నేషనల్ బ్యాంకు అధికారులు 1381 కేజీల బంగారాన్ని అప్పగించాల్సి ఉండగా.. ఎన్నికల అధికారులు సీజ్ చేయడం వల్ల దాన్ని 20వ తేదీ నాడు టీటీడీ ట్రెజరీలో జమ చేశారని ఆయన అన్నారు. బంగారాన్ని తరలిస్తున్న వాహనాన్ని ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్న వెంటనే- బ్యాంకు అధికారులు ఆ సమాచారాన్ని ఫోన్ ద్వారా తనకు తెలియజేశారని అన్నారు. ఈ కేసు విషయంలో ఆదాయపు పన్నుశాఖ అధికారులు తమకు నోటీసులను జారీ చేశారని, వాటికి సరైన, సంతృప్తికర సమాధానం ఇచ్చామని చెప్పారు. పట్టుబడ్డ బంగారం తమది కాదని ఐటీ అధికారులకు వివరణ ఇచ్చామని అన్నారు.
-
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications