వైభవంగా కోయిల్ అళ్వార్ తిరుమంజనం: ఆ సమయంలో శ్రీవారి మూలవిరాట్టును ఏం చేస్తారంటే?
తిరుమల: కలియుగ వైకుంఠం తిరుమలలో వెలిసిన శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం వైభవంగా ముగిసింది. ఈ నెల 16వ తేదీన శ్రీవారి ఆలయంలో సాలకట్ల ఆణివార ఆస్థానాన్ని పురస్కరించుకుని ఈ ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఈ తెల్లవారు జామున 6 నుండి ఉదయం 11 గంటల వరకు శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్ అళ్వార్ తిరుమంజనం సేవను నిర్వహిస్తుంటారు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు.
తెలుగు సంవత్సరాది ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల సమయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సారి సాలకట్ల ఆణివార ఆస్థానాన్ని పురస్కరించుకుని దీన్ని పూర్తి చేశారు.

శ్రీవారి ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి, ఆలయం లోపల ఉపాలయాలు, ప్రసాదాల పోటు, ఆలయ ప్రాంగణం, పూజాసామగ్రిని టీటీడీ అధికారులు శుద్ధి చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జవహర్ రెడ్డి, ఏవీ ధర్మారెడ్డి మాట్లాడారు.

కోయిల్ అళ్వార్ తిరుమంజనం సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి వేశారు. శుద్ధి పూర్తి అయిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు.

అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆ తరువాత భక్తులను దర్శనానికి అనుమతించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న పరిస్థితులు ఉన్నందున టీటీడీ పరిమితంగా భక్తులకు అనుమతి ఇస్తోన్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications