లాక్ డౌన్ ఎఫెక్ట్ : టీటీడీ ఉద్యోగులకు సెలవులు .. తిరుమలలో స్థానికులపై ఆంక్షలు
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం తిరుమల ఆలయం మీద పడింది. ఇక తిరుమలకు వచ్చిన ఒక భక్తుడికి కరోనా పాజిటివ్ అని తేలటంతో టీటీడీ తిరుమలలో భక్తుల దర్శనాలు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది . విదేశాల నుండి తిరుమలకు వచ్చిన ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ రావటంతో అతన్ని రుయా ఆస్పత్రికి తరలించారు. దీంతో స్వామీ వారి దర్శనాలు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక స్వామీ వారి నిత్య కైంకర్యాలు మాత్రమే కొనసాగుతున్నాయి.
ఇక దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన నేపధ్యంలో తిరుమలలో భద్రత పెంచారు. స్వామి వారి ఆలయంలో భక్తులకు శ్రీవారి దర్శనం లేక నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. ఇక ఆంధ్ర ప్రదేశ్ లో కూడా కరోనా వైరస్ ఎఫెక్ట్తో లాక్ డౌన్ చేసిన నేపధ్యంలో తిరుమలలో అధికారులు అప్రమత్తం అయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులకు అధికారులు సెలవులు ప్రకటించారు. 50 శాతం మంది ఉద్యోగులు మాత్రమే విధులకు హాజరుకావాలని సోమవారం ఆదేశాలు జారీ చేశారు.

ఇక సెలవులో ఉన్న ఉద్యోగులు వచ్చేవారం విధులకు వచ్చేలా ఆదేశాలిచ్చారు. కొంతమంది ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్కు అధికారులు సుముఖత వ్యక్తం చేశారు. ఈ నిబంధనలు ఏప్రిల్ 4 వరకు వర్తిస్తాయని టీటీడీ అధికారులు జీవో జారీ చేశారు.ఇక ఇదే సమయంలో నగర పోలీసులు తిరుమలలో స్థానికులపై కూడా ఆంక్షలు విధించారు. రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ ఉన్న నేపధ్యంలో ఈనెల 31 వరకు గృహనిర్బంధంలో ఉండాలని ఆదేశించారు. ఎవరూ బయట తిరగకూడదని చెప్పారు. కరోనా నియంత్రణకు సహకరించాలని కోరారు. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.


Click it and Unblock the Notifications